కరోనా వైరస్ పుట్టిన చైనా దాని బారి నుంచి క్రమంగా కోలుకుంటోంది. వరుసగా రెండోరోజుకూడా ఒక్కటి కూడా కొత్త కేసు నమోదు కాకపోవడం గమనార్హం. కానీ.. యూరప్ దేశమైన ఇటలీ మాత్రం కరోనాతో విలవిలాడుతోంది. ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనాను మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇది ఆ దేశ ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. నిజానికి.. కరోనా వైరస్ గురించి ప్రజలు తెలుసుకుని తేరుకునే లోపే.. ఆదేశంలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఆ దేశంలో సుమారు 4 వేల మంది మరణించారు. ఇక దాదాపు 50 వేల మందికి వైరస్ సోకింది. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే.. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఇటలీలో ఎక్కువగా పురుషులే చనిపోతున్నట్లు సర్వేలు చెబుతుండడం గమనార్హం. మహిళల కన్నా ఎక్కువ శాతం మంది పురుషులే వైరస్ వల్ల మరణిస్తున్నారని ఆ సర్వేలు పేర్కొంటున్నారు. మహిళలు, పురుషుల మరణాల మధ్య ఉన్న తేడా కొంత ఆందోళన కలిగిస్తున్నదని అధికారులు చెబుతున్నారు. ఇందులో కూడా 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. డెత్ రేట్ రెండింతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ తీవ్ర పరిణామాల ఆధారంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశ ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాకుండా.. ఇటలీ విషయంలో అమెరికా కూడా స్పందించింది. అక్కడ మరణాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇక కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 11,310కి చేరుకుంది. వైరస్ సోకిన వారి సంఖ్య 2,72,351కి చేరుకుంది. ఇందులో ఇటలీలోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆ దేశంలో వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 4032కు చేరుకోవడంతో తీవ్ర ఆంధళనకు గురిచేస్తోంది. సుమారు 50 వేల మందికి వైరస్ సోకింది. అలాగే, ఫ్రాన్స్లోనూ 12,612 మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది. 450 మంది చనిపోయారు. అయితే చైనాలో మాత్రం కొత్తగా వైరస్ సోకిన వారు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, యూరోప్లో వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష దాటినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.