ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు బేబీ డాల్ సింగ‌ర్‌గా గుర్తింపు పొందిన క‌నికాక‌పూర్‌. ఆమె నిర్ల‌క్ష్యంతో నేడు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌ముఖులు గ‌డ‌గ‌డ‌వ‌ణికిపోతున్నారు. ఇంత‌కీ ఆమె ఏం చేసింద‌ని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు ఈ చిన్న క‌థ‌నం చ‌ద‌వాల్సిందే మ‌రి. క‌నికాక‌పూర్ బాలీవుడ్ సింగ‌ర్‌.  ఈ నెల 10న లండన్‌ నుంచి ముంబైకి విమానంలో వచ్చారు. మరుసటి రోజు విమానంలో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోకు చేరుకున్నారు. అక్కడే ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో జరిగిన పార్టీలో పాల్గొన్నారు.  అయితే.. నాలుగు రోజుల కిందట జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో కనికాకపూర్‌ వైద్యపరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో తాను స్వీయ‌ నిర్బంధంలోకి వెళ్తున్నానని ఆమె శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఆ వార్త‌తో  ఆమెతోపాటు కుటుంబ సభ్యులు లక్నోలోని సంజయ్‌ గాంధీ మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. తన కూతురు ఈ నెల 13, 14, 15వ తేదీల్లో వరుసగా మూడు పార్టీల‌కు  హాజరయ్యిందని, సుమారు  250-300 మందిని ఆమె కలుసుకొన్నట్టు కనికాక‌పూర్‌ తండ్రి రాజీవ్‌ కపూర్‌ తెలిపారు.

 

 అయితే.. లక్నోలో జ‌రిగిన పార్టీకి రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్‌ సింగ్‌, ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య శాఖ మంత్రి జైప్రతాప్‌ సింగ్‌తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పంకజ్‌ సింగ్‌, ధిరేంద్ర సింగ్‌, తేజ్‌పాల్‌ పాల్గొన్నారు. క‌నికాక‌పూర్‌కు క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే.. అంద‌రూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విష‌యం అక్క‌డితోనే ఆగ‌లేదు.. రాష్ట్రపతి కోవింద్‌ ఈ నెల 18న ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు ఎంపీ దుష్యంత్‌ కూడా హాజరయ్యారు. మరోవైపు యూపీ ప్రభుత్వం లక్నోలోని తాజ్‌మహల్‌ హోటల్‌ను సీజ్‌ చేసింది. ఇక్కడ జరిగిన ఓ దావత్‌లో కనిక పాల్గొన్నట్టు సమాచారం.  సింగ‌ర్ క‌నికాక‌పూర్ ఎవ‌రెవ‌రిని క‌లిశారు.. అన్న దానిపై అంద‌రూ తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: