నోవెల్ కరోనా వైరస్ ప్రపంచానికి కునుకులేకుండా చేస్తోంది. రోజురోజుకూ విస్తరిస్తూ వేలాదిమంది ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ఈ వైరస్తో వృద్ధులే ఎక్కువ శాతం చనిపోతున్నారు. అయితే.. ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు కీలక విషయాలను వెల్లడించింది. యువతీయవకుల్ని కూడా ఆ మహమ్మారి పట్టిపీడిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా వైరస్ వల్ల టీనేజీ యువత కూడా తీవ్ర అనారోగ్యానికి లోనవుతున్నట్లు డబ్ల్యూహెచ్వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అదనమ్ గేబ్రియాసిస్ వెల్లడించారు. ఇక్కడే మరో కీలక విషయాన్ని కూడా ఆయన చెప్పడం గమనార్హం. యువత వల్లే వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్వో అంచనా వేస్తోంది. ఇది నిజంగా యూత్కు షాకింగ్ న్యూసే. ఎక్కువ శాతం మంది వృద్ధులే మరణిస్తున్నా.. వైరస్ మాత్రం యువత వల్ల వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోందని అభిప్రాయపడుతోంది. తమ పద్ధతి మార్చుకోవాలని సూచిస్తోంది.
అయితే.. తమకేం కాదన్న ధోరణితో యువత ఉంటోందని, కానీ వారి వల్లే ఆ వైరస్ వాళ్లవాళ్ల ఇళ్లలోకి ప్రవేశిస్తున్నట్లు పలువురు శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. దాంతోనే వారివారి బామ్మలు, తాతయ్యలు, తల్లితండ్రులకు సోకుతున్నట్లు ఓ అంచనాకు వచ్చారు. యువకుల్లో కరోనా లక్షణాలు కనిపించకపోయినా.. వారు మాత్రం వారధిగా వ్యవహరిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు.అయితే.. యువకుల్లో మరణాల సంఖ్య ఒక్క శాతం కన్నా తక్కువే ఉంది. యువత ఇంటికి పరిమితం కావాలని గట్టిగా చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు రెండున్నర లక్షలకు చేరుకున్నది. మరణాల సంఖ్య సుమారు 11వేలు దాటింది. అయితే వైరస్ మాత్రం రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాలు జనం గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ కరోనా కట్టడికి పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాయి.