కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది . ఇప్పటికే అనేక ముందస్తు చర్యలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం , తాజాగా రానున్న రోజుల్లో వైద్యులు , ఇతర వైద్య విభాగ సిబ్బంది కొరత తలెత్తకుండా తరుణోపాయాన్ని కనుక్కొంది . గతంలో ప్రభుత్వ వైద్యులుగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన వారిని , ఇతర వైద్య సిబ్బందిని మూడు నెలల కాలానికి కాంట్రాక్ట్ పద్దతిలో విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది .
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు, ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది . తెలంగాణ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 21 కి చేరుకోగా, వీరంతా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారే కావడం విశేషం . అయితే తొలిసారిగా కూకట్ పల్లి కేపీహెచ్ బీ కాలనీ కి చెందిన ఒక గృహిణి కి కరోనా పాజిటివ్ గా రావడం స్థానికులను ఆందోళన కు గురి చేస్తోంది . సదరు గృహిణి సోదరుడు ఇటీవల విదేశాల నుంచి ఆమె ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది . అయితే అతనికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయా ? లేదా ?? అన్న దానిపై స్పష్టత కరువయింది . దీనితో సదరు గృహిణి కి ఎలా కరోనా బాధితురాలిగా మారిందన్న అంతుచిక్కని ప్రశ్నగా తయారయింది .
ఇక కరోనా వైరస్ వ్యాప్తి ని అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల సరిహద్దులను మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది . ఇప్పటికే విస్తృత స్థాయి లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి , తనిఖీలు చేస్తున్నారు . ఇక మహారాష్ట్ర లో కరోనా బాధితుల సంఖ్య రోజుకింత పెరుగుతుండడం తొలుత ఈ సరిహద్దు ను మూసివేయాలన్న యోచన లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన ప్రాయంగా వెల్లడించారు .