దేశంలో కరోనా రెండవ దశలో ఉంది. నిజానికి ఫిబ్రవరి చివరి వారం దాక కరోనా గురించి ఎవరూ పెద్దగా పట్టించుకున్నదే లేదు. ఆ తరువాత చూసుకుంటే గత ఇరవై రోజులుగానే కరోనా గురించి కొంత యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. అయితే ఒక్క రోజు జనతా కర్ఫ్యూ చేయడంతో కరోనా అంతమవుతుందా అంటే సైంటిస్టులు పెదవి విరుస్తున్నారు.
కరోనా ఇపుడు దేశంలో అదుపులో ఉన్నట్లుగా కనిపించినా రానున్న పది పదిహేను రోజుల్లో విశ్వరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దానికి గల కారణాలు కూడా వారు వివరిస్తున్నారు. లక్షల్లో పెద్ద ఎత్తున విదేశాల నుంచి వచ్చిన వారికి పెద్దగా పరీక్షలు జరపకుండా తూతూమంత్రంగానే చూసి పంపించేశారని ఆరోపణలు ఉన్నాయట.
అదే విధంగా సెల్ఫ్ డిక్లరేషన్ పేరిట మెజారిటీ జనాలను ఏకంగా ఇళ్ళకు పంపించేసారని, వారి ద్వారా లోకల్ గా ఉన్న వారికి వ్యాపిస్తే అపుడు మూడవ దశ మొదలవుతుందని అంటున్నారు. మూడవ దశ కనుక మొదలైతే అది నాలుగవ దశకు చేరడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చునని కూడా హెచ్చరిస్తున్నారు.
అపుడు ఇటలీ తరహా కేసులు వేలల్లో లక్షల్లో వస్తాయని, దేశంలో అంతమందిని వైద్య సేవలు అందించే సదుపాయాలు లేని పరిస్థితి ఉన్న వేళ వారంతా మరింతమందికి వ్యాధి వ్యాపించడానికి కారణమవుతారని సైటిస్టులు అంటున్నారు.
ఈ రకమైన పరిస్థితి రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందే మేలుకోవాలని అంటున్నారు. దానికి నాందిగా జనతా కర్ఫ్యూ ఒక్క రోజు చేయడం బాగుందని అయితే ఇది సరిపోదని, దాన్ని కనీసంగా పదిహేను రోజుల పాటు చేయాలని సూచిస్తున్నారు. అలా దేశం మొత్తం లాక్ డౌన్ చేస్తేనే కరోనా మూడవ దశకు చేరుకుండా ఉంటుందని అంటున్నారు.
ఇండియా లాంటి దేశాలలో మూడవదశ దాకా పరిస్థితులను తీసుకురాకుండా అటు ప్రభుత్వాలు ఎంత బాధ్యతగా ఉండాలో అంతే బాధ్యతగా ప్రజలు కూడా ఉండాలని సూచిస్తున్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఇళ్ళకు చేరిన వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని, తద్వారా కరోనా వ్యాప్తికి అక్కడే అరికట్టేలా చూడాలని అంటున్నారు.
మొత్తం మీద చూసుకుంటే రానున్న పదిహేను రోజులూ దేసానికి అత్యంతా కీలకమైన పరీక్షా సమయంగా సైటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా మేధావులు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు.