కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రపంచవ్యప్తంగా ప్రజలను గడగడలాడిస్తుంది. ఇప్పటికే వేలమంది కరోనాకు బలి అయిపోయారు. లక్షల్లో ఈ వైరస్ బారిన పడి నానా తిప్పలు పడుతున్నారు. ఇక భారత దేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 283కి చేరినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. అయితే ఈ వైరస్ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 22న, అంటే ఆదివారం దేశ ప్రజలంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.
తప్పనిసరైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. మార్చి 22న చేపట్టే జనతా కర్ఫ్యూ విజయవంతం చేయడం, ఆ అనుభవాలు భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి మనల్ని సన్నద్ధం చేస్తాయన్నారు. ఇక దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలైంది. ప్రధాని మోడీ పిలుపుతో కరోనాపై ప్రజలు యుద్ధం ప్రకటించారు. కరోనా మహమ్మారిని నిలువరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.
దీంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 14 గంటలు ప్రజలు కర్ఫ్యూలో పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 24 గంటలు బంద్ పాటిస్తున్నారు. అటు ప్రజా రవాణా బంద్ అయింది. బస్సు, మెట్రో సర్వీసులు, పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. రాత్రి 10 గంటల వరకు అన్ని రైళ్లు రద్దు చేశారు. అయితే జనతా కర్ఫ్యూ కారణంగా ఇంటికే పరిమితమయ్యామనే బాధ కన్నా.. మనల్ని మనం చూసుకునేందుకు, మన ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకునేందుకు ఇది చక్కని అవకాశంగా భావిద్దాం. మనకు దొరికిన ఈ సమయాన్ని మంచిగా ప్లాన్ చేసుకుని.. ఓ గంట సేపు ధ్యానం, యోగా, ఇంట్లోనే వ్యామాయం వంటివి చేసుకుందాం.