ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్.. బారత్లోనూ వ్యాప్తిచెందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 2, 82, 744 కరోనా వైరస్ వ్యాధి కేసులు నమోదుకాగా, కరోనా వైరస్ వ్యాధితో 11, 820 మంది మరణించారు. భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 271కి చేరింది. ఇక ముంబై, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ లో కరోనా వైరస్ వ్యాధి కారణంగా నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజల్లో తీవ్రభయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే మార్చి 22వ తేదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఇది ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత విధించిన కర్ఫ్యూ అని స్పష్టం చేశారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు భారత్ ఎంత సమాయత్తంగా ఉందో తెలుసుకోవడానికి 'జనతా కర్ఫ్యూ' ఒక పరీక్షా సమయంలా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇక దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ మొదలైంది. కరోనా కట్టడికి మేము సైతం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్టాండ్లు వెలవెల బోతున్నాయి.
ఇక దేశవ్యాప్తంగా 14 గంటలు ప్రజలు కర్ఫ్యూలో పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 24 గంటలు బంద్ పాటిస్తున్నారు. అటు ప్రజా రవాణా బంద్ అయింది. బస్సు, మెట్రో సర్వీసులు, పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. అయితే ఆదివారం మొత్తం జనతా కర్ఫ్యూ ప్రకటించిన నేపథ్యంలో మనకు ఉన్న సమయాన్ని మంచిగా ప్లాన్ చేసుకుని.. ఏయే సమయానికి ఏమేం చేయాలో నిర్ణయించుకుని ఇంట్లోనే ఉండి ఆ సమయాన్ని గడిపేలా వ్యవహరిద్దాం. మన ఆరోగ్యానికి కొంత సమయం, భార్యా పిల్లలకు కొంత సమయం, తల్లిదండ్రులకు కొంత సమయం, బుక్స్ చదవడం, వ్యాయామం చేయడం, యోగా చేయడం ఇలా రోజంతా మంచిగా ప్లాన్ చేసుకుని వ్యవహరిస్తే.. ఎలాంటి బోరింగ్ ఉండదు.