కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ప్రపంచాన్నే కమ్మేసింది. ఈ వైరస్ దెబ్బకు ప్రజలు అబ్బా అంటున్నారు. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరియు లక్షల్లో ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ రక్కసి అంతమవ్వడం లేదు. భారత్లోనూ కరోనా వైరస్ ప్రభావం చూపుతోంది. అయితే ఈ వైరస్ను హతమార్చడానికి ప్రధాని నరేంద్ర మోడి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పౌరులందరికీ సూచించారు.
అలాగే మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్టేనని, ఆదివారం ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని, సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచే తమ పనులు చేసుకోవాలని, గుమిగూడొద్దని, ఒకరికొకరు సామాజిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. మోడీ పిలుపు మేరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. అటు ప్రజా రవాణా బంద్ అయింది. బస్సు, మెట్రో సర్వీసులు, పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. రాత్రి 10 గంటల వరకు అన్ని రైళ్లు రద్దు చేశారు.
అయితే జనతా కర్ఫ్యూ అసలు ఉద్దేశం.. కరోనా వైరస్ ప్రస్తుతం మనదేశంలో రెండో దశలో ఉంది. మొదటి దశ విదేశాల నుంచి వచ్చినవాళ్లు ఈ వైరస్ బారినపడడం.. రెండో దశలో విదేశాల నుంచి వచ్చినవాళ్లు తిరిగిన ప్రాంతాల్లో వైరస్ గాల్లోనే ఉంటుంది. ఈ దశలో వైరస్ను చంపగలిగితే పెద్ద ముప్పు తప్పినట్టు అవుతుంది. కానీ రెండో దశలో కరోనాను చంపకపోతే మూడో దశకు చేరుకుంటుంది.
గాల్లో ఉన్న వైరస్ మనుషుల్లోకి చేరడం.. వాళ్లు తుమ్మినప్పుడు, దగ్గినపుడు, చేతులు కలిపినపుడు అంటువ్యాధిలా అందరికీ వైరస్ పాకడం జరగుతుంది. ఫలితంగా నాలుగో దశలో ఊహించని విధంగా ప్రాణనష్టం జరుగుతుంది. అందకే జనతా కర్ఫ్యూ ద్వారా 14 గంటల పాటు ఇంట్లోనే ఉంటే వైరస్కు ఉన్న చైనులింకు లాంటి బంధం తెగిపోతుంది. ఎక్కడికక్కడే అది తుడిచిపెట్టుకునిపోతుంది. ఇదే జనతా కర్ఫ్యూ ప్రధాన ఉద్దేశం.