కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే మన దేశంలో కరోనా పాజిటివ్ సోకిన బాధితుల సంఖ్య ఇప్పటికే 300 కు చేరువ అవుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు ఇప్పటికే 2.5 లక్షలను క్రాస్ చేసి 3 లక్షలకు చేరువ అవుతోంది. ఇక ఇప్పటికే ఈ మహమ్మారి భారీన పడి ప్రపంచ వ్యాప్తంగా 12 వేల మంది చనిపోగా.. ఈ సంఖ్య మరింతగా పెరగనుంది. ఇదిలా ఉంటే ఈ వైరస్ను కంట్రోల్ చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ఆదివారం ప్రజలు అందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు.
ఇక ఆదివారం ఉదయం నుంచి భారత దేశం మొత్తం జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా అమలు అవుతోంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కోరలు చాస్తోన్న నేపథ్యంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా లాక్ డౌన్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఇంతకు లాక్ డౌన్ ప్రకటించిన రాష్ట్రం ఏదో కాదు ఒడిశా.
ఒడిశాలోని ఐదు జిల్లాలను లాక్డౌన్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఖుర్దా, కటక్, గంజాం, కేంద్రపారా, అంగుల్ జిల్లాల్లో లాక్డౌన్ చేస్తున్నట్లు తెలిపారు.
కరోనా వైరస్ ఈ ఐదు జిల్లాలో జోరుగా విజృంభిస్తోంది. దీంతో ఆదివారం 22వ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు ఐదు జిల్లాలోని లాక్డౌన్ ఉంటుందన్నారు.ఇప్పటికే పూరీ, రూర్కేలా, సంబల్పూర్, జార్షూగూడ, బాలాసోర్, జాజ్పూర్ రోడ్, జాజ్పూర్ టౌన్, భద్రక్ పట్టణాల్లో ఒడిశా ప్రభుత్వం లాక్డౌన్ చేసింది. ఇక లాక్ డౌన్ ప్రకటించిన చోట్ల కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. వారం క్రితమే రాష్ట్ర రాజధాని భువనేశ్వర్, కటక్ వంటి పారిశ్రామిక పట్టణాలు మూతపడ్డాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో దాదాపు 40శాతం మూతపడినట్లయింది.