కరోనా.. చాలా సులభంగా ఒకరి నుంచి మరొకరిని వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి. అయితే ఈ కరోనా వ్యాపించే దశలు చాలా ముఖ్యం.. వీటి గురించి తెలుుకుంటే ..అసలు మనం ఏం స్టేజ్ లో ఉన్నాం.. ఎంత జాగ్రత్త గా ఉండాలన్నది అర్థం అవుతుంది. కరోనా మొదటి దశ ఏంటంటే..ఇది విదేశాల నుంచి వచ్చే వారికే వస్తుంది. చైనా, ఇటలీ, ఇరాన్, అమెరియా, యునైటెడ్ కింగ్డమ్, ఇండోనేషియా దేశాలకు వెళ్లి వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్గా వస్తుంది.
ఇప్పటి వరకూ హైదరాబాద్లో వెలుగు చూసిన కేసులన్నీ ఈ మొదటి దశలోనివే. విదేశాలకు వెళ్లి వచ్చేవాళ్లను ఆయా దేశాల్లోనే నియంత్రించడం ద్వారా తొలి దశలోనే వైరస్ను కట్టడి చేయవచ్చు. వీరిని ఎయిర్ పోర్టుల నుంచే క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వీరి కట్టడి సులభమే.. ఈ దశలో కరోనా ను నియంత్రించొచ్చు. ఇక రెండో దశ విదేశాలకు వెళ్లి కరోనా బారినపడి, మన దగ్గరుకు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులు, సహోద్యోగులకు వైరస్ విస్తరింపజేసే దశ.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ.. దేశంలోనూ ఈ రెండో దశ కొనసాగుతుంది. ఈ దశను లోకల్ ట్రాన్స్మిషన్గా పిలుస్తారు. అంటే విదేశీయుల నుంచి స్థానికులకు వ్యాపించడం అన్నమాట. అందుకే.. విమానాశ్రయాల్లో విదేశీ ప్రయాణికులు దిగగానే వారిని స్క్రీనింగ్ చేయడం, లక్షణాలు ఉన్నవారిని ఆస్పత్రులకు తరలించి, చికిత్సలు చేయించడం చేస్తున్నారు. వారికి వ్యాధి లక్షణాలు లేకపోయినా వారిని ఇతరులకు దూరంగా ఉంచడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరించకుండా కట్టడి చేస్తున్నారు.
ఇక అత్యంత కీలకమైంది మూడో దశ.. ఇది చాలా ప్రమాదకరమైన దశ. రెండో దశలో వైరస్ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల ఉన్న వారికి పెద్ద ఎత్తునవైరస్ విస్తరిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేలాది మందికి విస్తరిస్తుంది. మరణాల సంఖ్య భారీగా ఉంటుంది. నియంత్రణ కష్టమవుతుంది. ఇటలీ, ఇరాన్లు ప్రస్తుతం ఇదే దశను ఎదుర్కొంటున్నాయి. ఇక నాలుగో దశ వైరస్ నియంత్రణ చాలా కష్టమవుతుంది. ఈ దశ తొలిసారి చైనా అనుభవించింది. అయితే కఠిన చర్యల ద్వారా చైనా విజయం సాధించినట్టే కనిపిస్తోంది.