రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతున్న కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఏపీ ప్రభుతవం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎమర్జెన్సీ మినహా పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి వరకు కూడా ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అంటు వ్యాధుల చట్టం-1897 లోని సెక్షన్ 2,3,4 ప్రకారం.. కరోనా (కోవిడ్-19) వ్యాధి నియంత్రణ, నివారణకు కఠినమైన నిబంధనలు అమలు చేస్తారు. గాలి ద్వారా, లేదా మనిషి నుంచి మనిషికి వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు అత్యవసరం మినహా సకల వ్యవస్థలను దిగ్బంధించే ప్రయత్నం చేస్తారు.
దీన్నే లాక్డౌన్గా పిలుస్తున్నారు. ఇక ఏపీలో తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకు రావాలన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశం మొత్తం ఇదే దిశగా అడుగులు వేస్తోందని, ఏపీ కూడా అదే బాటలో వెళ్తేనే కరోనాను నియంత్రించగలమన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర, నిత్యావసర వస్తువులు, సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. అదే సమయంలో పేదలకు ఇబ్బంది కలగకుండా ఆదుకునేందుకు ప్రతి ఇంటికి రూ.వెయ్యితోపాటు ఉచితంగా రేషన్, కిలో పప్పు సరఫరా చేయనుంది. అయితే లాక్ డౌన్ అయినప్పటికీ కొన్ని సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అవేంటో చూసేయండి
లాక్డౌన్ సమయంలోనూ అందుబాటులో ఉండనున్న సేవలు:
- నిత్యావసర తయారీ యూనిట్లు, వాటి సరఫరా
- ఆహారం, సరుకులు, పాలు, పండ్లు, కూరగాయలు, చేపల రవాణా
- అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్, తాగునీరు, పురపాలక సేవలు..
- బ్యాంకులు, ఏటీఎంలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా
- గిడ్డంగులు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు, కళ్లజోళ్ల దుకాణాలు
- ఔషధ తయారీ వాటి రవాణా కార్యాలయాలు
- ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలను ఈ కామర్స్ సైట్ ద్వారా పొందే అవకాశం
- కరోనా నియంత్రణ కార్యాకలాపాల్లో పాల్గొనే ప్రైవేట్ సంస్థలు
- పెట్రోల్ పంపులు, ఎల్పీజీ గ్యాస్, ఆయిల్ ఏజెన్సీలు, వాటి రవాణా
- టెలికం, ఇంటర్నెట్ సేవలు
- పోలీసు, వైద్య, ఆరోగ్యం, పట్టణ, స్థానిక సంస్థలు..
- తప్పనిసరిగా ఉత్పత్తి , తయారు చేయాల్సిన సంస్థలు ఏమైనా ఉంటే వాటి మినహాయింపు కోసం కలెక్టర్ అనుమతి తీసుకోవాలి.