తెలంగాణ రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. ఆదివారంతో తెలంగాణలో కరోనా కేసులు 33 వరకు ఉన్నాయి. అయితే సోమవారం మరో ముగ్గురికి పాజిటివ్ రాగా ఈ కేసులు 36కు చేరుకున్నాయి. ఇక మరో షాక్ ఏంటంటే మంగళవారం సైతం మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 39కు చేరుకుంది. ఇక సీఎం కేసీఆర్ మంగళవారం సైతం తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకో నున్నారు.
ఇక మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేసీఆర్ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఎవ్వరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ఇక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకోనుంది. ఫీవర్ సర్వైలెన్స్ స్టేట్గా ప్రకటించింది. అంటే ఇకపై జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తికి ఆరోగ్య పరీక్షలతో పాటు కరోనా పరీక్షలు కూడా చేస్తారు.
ఇక బయట లాక్ డౌన్ ఉన్నా కూడా జనాలు ప్రభుత్వం మాట లెక్క చేయకుండా బయటకు వస్తున్నారు. దీంతో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. బయటకు వచ్చిన వారిని వచ్చినట్టు కొడుతున్నారు. మరి కొందరిని పోలీసుల వాహనాల్లో కూడా ఎక్కించు కుంటున్నారు. అసలు ప్రజలు కూడా ఇలాంటి పరిస్థితులు ఎంత వరకు తెచ్చుకోవడం మంచిది కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. పోలీసులకు సహకరిస్తూ కరోనాకు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది.
ఇక పోలీసులు బయటకు వచ్చిన ప్రజలను ఇష్ట మొచ్చినట్టు కొడుతుండడంతో ఆ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ వీటిని చూస్తోన్న వారు బయటకు వచ్చేందుకు కూడా సాహసించని పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటుందనే చెప్పాలి.