కరోనాను ఏపీలో కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్త మవుతోంది. ఇప్పటికే తెలంగాణలో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ప్రకటించినా ప్రజలు బయటకు వచ్చేస్తున్నారు. దీనికి తోడు అక్కడ రోజు రోజుకు కేసులు పెరిగి పోతున్నాయి. దీంతో కేసీఆర్ చాలా సీరియస్గా పోలీసులకు వార్నింగ్ ఇచ్చేశారు. ఎవరైనా ప్రజలు బయటకు వస్తే కొట్టమని ఆదేశాలు ఇవ్వడంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎవరైనా వాహనాల మీద బయటకు వస్తే తుక్కు తుక్కగా కొడుతున్నారు. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
ఇక ఏపీలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు 9కు చేరుకున్నాయి. ఇకపై కరోనా ముందుకు వెళ్లకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఇక మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కరోనాను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ఇందుకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరం అని ఆయన చెప్పారు. ఇక విశాఖ పట్నం జిల్లాలో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు గుర్తించామని.. ప్రతి ఒక్కరు లాక్ డౌన్ కార్యక్రమంలో పాటించి కరోనాను కట్టటి చేసుకుందామని ఆయన పిలుపు నిచ్చారు.
అలాగే ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సూచనలు కూడా పాటించాలని ఆయన పిలుపు ఇచ్చారు. కరోనా మన రాష్ట్రంలో మూడో స్టేజ్లోకి వెళ్లిందన్న అపోహలు వద్దని కూడా ఆయన చెప్పారు. ఇక విశాఖ జిల్లాలో కరోనా కేసులు మూడు పాజిటివ్లు రావడంతో ఇప్పటికే అక్కడ 20 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఈ జిల్లాలో మొత్తం పరిస్థితిపై సమీక్ష చేయడంతో పాటు 1470 మందిని క్వారంటైన్ చేశశామని కూడా చెప్పారు. ఇక కేంద్రం నుంచి వచ్చే సహాయం కోసం ఎదురు చూడకుండానే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున రేషన్తో పాటు ఖర్చులకు రు. 1000 ఇవ్వాలని నిర్ణయించామన్నారు.