కరోనా వైరస్ విస్తృతి నేపధ్యం లో విదేశాల నుంచి వచ్చిన వారిని ఎయిర్ పోర్ట్ లో పరీక్షలు నిర్వహించిన తరువాత స్వీయ క్వారంటైన్ కు అనుమతిస్తున్నారు . అయితే అధికారులు కల్పిస్తున్న స్వేచ్ఛను కొంతమంది దుర్వినియోగం చేస్తూ , తమ ప్రాణాలతో పాటు , ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు . స్వీయ క్వారంటైన్ కు అనుమతి తీసుకున్న కొంతమంది ఇష్టారీతి లో నిబంధనలు ఉల్లంఘిస్తున్న తీరు విమర్శలపాలవుతోంది . సామాజిక బాధ్యతను విస్మరించి చదువుకున్న వ్యక్తులే ఈ తరహా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
ఒక వ్యక్తి క్వారంటైన్ నుంచి మూడు సార్లు తప్పించుకునే ప్రయత్నం చేయగా , అతన్ని అధికారులు పట్టుకుని తిరిగి క్వారంటైన్ కు తరలించినట్లు స్వయంగా టీఎస్ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం లో వెల్లడించారు . ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మహిళ భర్త , పిల్లలతో కలిసి సింగపూర్ లో ఉంటూ , ఇటీవల ఒంటరిగా స్వదేశానికి తిరిగి వచ్చింది . కరోనా కట్టడి నేపధ్యం లో సదరు మహిళను సెల్ఫ్ క్వారంటైన్ కు అధికారులు అనుమతి ఇచ్చారు . ఈ మేరకు ఆమె చేతికి స్టాంపింగ్ కూడా చేశారు . అయితే సదరు మహిళ స్వీయ క్వారంటైన్ కు వెళ్లకుండా , తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓల్డ్ బోయిన్ పల్లి లో జల్సా చేస్తూ పోలీసుల చేతికి చిక్కింది .
ఎయిర్ పోర్ట్ నుంచి నిజామాబాద్ లోని తన నివాసానికి వెళ్లాల్సిన సదరు మహిళ నగరం లోని ఓల్డ్ బోయిన్ పల్లి లోని తన ప్లాట్ కు ప్రియుడు ని పిలిపించుకుని విపరీతమైన మ్యూజిక్ తో రాత్రంతా మందు పార్టీ చేసుకున్న తీరుపై అపార్ట్ మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయాన్నే లేచి ఆమెను నిలదీశారు . ఈ క్రమం లో ఆ మహిళ చేతికి సెల్ఫ్ క్వారంటైన్ స్టాంప్ ఉండడం చూసి , అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు . దీనితో , పోలీసులు రంగ ప్రవేశం చేసి సదరు మహిళను , ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు .