అమెరికాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ప్రజల ఇంటికే పరిమితం అయ్యారు. అనేక సంస్థలు తమకార్యకలాపాలను నిలిపివేశాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రజల అత్యవసరాలను తీర్చేందుకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. పెద్దవాళ్లకు 1200 డాలర్లు సాయం అందించనున్నారు. అయితే.. ప్రస్తుతం పెరుగుతున్న డాలర్ విలువను దృష్టిలో పెట్టుకుంటే.. మన కరెన్సీలో అయితే ఏకంగా లక్షరూపాయలను నగదు బదిలీ ద్వారా ఆ దేశ పౌరులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా..చిన్న పిల్లలకు కూడా ఈ ప్యాకేజీలో భాగం ఉండడం గమనార్హం. చిన్న పిల్లలకు 500 డాలర్లను అందించబోతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు.. వివిధ రకాలుగా ఏర్పడిన నష్టాన్ని తట్టుకోవడానికి.. రెండు ట్రిలియన్ డాలర్లు ఆర్థిక ప్యాకేజీకి అమెరికా సెసెన్ ఆమోదం తెలిపింది. రెండు ట్రిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 150 లక్షల కోట్లు అన్నమాట.
అయితే ప్రస్తుతానికి అమెరికాలో షట్డౌన్ లేదుగానీ.. న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా తదితర రాష్ట్రాల్లో మాత్రం కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉండడం గమనార్హం. అనేక ఉత్పత్తి రంగాలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఉద్యోగులు, కార్మికులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా దెబ్బతిన్నాయి. ఇలా అమెరికా పౌరుల ఉపాధి, వ్యాపారానికి తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో వారిని ఆదుకోవాలని ట్రంప్ నిర్ణయించారు. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినకముందే మేల్కొని అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా.. ఆర్థిక ప్యాకేజీకి సెనెట్లో ఆమోద ముద్ర వేయించుకోగలిగారు. ఇక ప్యాకేజీలో కేటాయించిన నిధుల్లో 367 బిలియన్ డాలర్లు చిన్న వ్యాపారులను ఆదుకునేందుకు కేటాయించారు. ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ఈ మొత్తం వెచ్చిస్తారు. అలాగే.. బడా వ్యాపార సంస్థలకూ భారీ సాయం ప్రకటించారు. 500 బిలియన్ డాలర్లు.. గ్యారంటీలకు.. సబ్సిడీలకు కేటాయించారు. అత్యధికంగా హాస్పిటల్స్కు నిధులు అందించబోతున్నారు. ఎక్కడివక్కడ ఆగిపోయిన ఎయిర్లైన్స్ సంస్థలకూ సాయం చేయబోతున్నారు ట్రంప్.