కరోనా వైరస్ బారిన పడి మృతి చెందుతున్నవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రపంచ దేశాలన్నీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎక్కడికక్కడ ప్రజలను స్వీయనిర్బంధంలోకి నెట్టినా.. పలు దేశాలు పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్నా.. వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. చైనాలోని వుహాన్నగరం కేంద్రంగా పుట్టిన కరోనాతో అక్కడ ఇప్పటి వరకు ఈ దేశంలో 3285మంది మరణించారు. ఆ తర్వాత ఇటలీలో అయితే.. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటివరకు 6820మంది మృత్యువాతపడ్డారు. ఆ తర్వాత ఎక్కువగా వైరస్ ప్రభావం పడిన దేశం స్పెయిన్ కావడం గమనార్హం. స్పెయిన్లో ఇప్పటివరకు ఏకంగా 3434మంది చనిపోయారు. అంటే.. ఇటలీ తర్వాత కరోనాతో మృతి చెందింది ఎక్కువగా స్పెయిన్లోనే కావడం గమనార్హం. ఈ లెక్కలే చెబుతున్నాయి.. ఆ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో..! కరోనా వైరస్ వల్ల స్పెయిన్లో మృతిచెందిన వారి సంఖ్య ఇప్పుడు చైనాను కూడా దాటేసిందన్నమాట.
స్పెయిన్లో గత 24 గంటల్లో ఏకంగా 738 మంది చనిపోయారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 3434కు చేరుకున్నది. ఇప్పుడు అత్యధిక మరణాలు నమోదు అయిన రెండవ దేశంగా స్పెయిన్ నిలిచింది. ఇక్కడ వైరస్ సోకిన వారి సంఖ్య 48 వేలు దాటింది. ఒక్క కటలోనియా ప్రాంతంలోనే దాదాపు 10 వేల కేసులు నమోదు అయ్యాయి. ఈ దారుణ పరిస్థితులతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ పూటగడుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో స్పెయిన్లో ఎమర్జెన్సీ మరో రెండు వారాల పాటు పొడుగించాలని ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ నిర్ణయించారు. అయితే...ఆయన ప్రతిపాదనకు ఎంపీలంతా మద్దతు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు కఠిన నియమాలను అమలు చేయనున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య సుమారు 20వేలకు దగ్గరలో ఉంది. వైరస్ బారినపడిన వారి సంఖ్య ఏకంగా నాలుగు లక్షలకు పైగా ఉంది. కేవలం లక్షమందికిపైగా మాత్రమే ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ముందుముందు పరిస్థితులు మరెంత దారుణంగా ఉంటాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.