కరోనా నేపథ్యంలో ప్రజలకు సాయం చేసేందుకు నాయకులు ముందుకు వస్తున్నారు. అయితే ఏపీలో ఈ సాయం కోసం ప్రజాప్రతినిధులు పోటీపడుతున్నారు. నిన్ననే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పది లక్షల రూపాయల సాయం ప్రకటించారు. అంతే కాదు.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల వేతనం కరోనా బాధితుల కోసం వినియోగించేందుకు సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నామని ప్రకటించారు.

 

 

అయితే దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా మేలుకున్నారు. వారు కూడా విరాళాలు ప్రకటించేందుకు ముందుకొచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఒక నెల జీతాన్ని ప్రధాని సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

 

 

కరోనా వైరస్‌ కారణంగా మానవాళికి తీవ్ర సంక్షోభం తలెత్తిందని విజయ సాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్య సిబ్బంది, అధికారులు సాహసోపేతంగా పని చేస్తున్నారని అభినందించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయని గుర్తు చేశారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఇంటికి పరిమితం కావడం చాలా ముఖ్యమని తెలిపారు. పని చేస్తే కానీ తిండి దొరకని వారికి అన్ని రకాల సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

 

 

పేద ప్రజలకు అండగా ఉండేందుకే ప్రధాని, సీఎం సహాయ నిధులకు విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. కరోనాపై పోరాటానికి భావసారూప్యత ఉన్న వ్యక్తులు కూడా తమ వంతు సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: