సోషల్ మీడియాలో కరోనా వైరస్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఏపీలోనే ఇలాంటి రాజకీయాలు ఎక్కువ నడుస్తున్నాయి. ఒక వైపు కరోనా వ్యాప్తి రోజురోజుకు ఎక్కువతుంటే, మరోవైపు దానిపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయం నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇరు పార్టీల కార్యకర్తలు ప్రత్యర్థి నాయకులని తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
మొన్నటికి మొన్న కరోనా వైరస్ గురించి జగన్ మీడియాతో మాట్లాడుతూ... కరోనా తగ్గాలంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరి.. బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరి అంటూ కొన్ని కామెంట్లు చేసారు. ఇక దీనిపై టీడీపీ కార్యకర్తలు తీవస్థాయిలో ట్రోల్స్ చేసారు. అసలు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ గురించి జగన్ ఇంత తేలికగా మాట్లాడటం పట్ల టీడీపీ వాళ్ళు కాస్త ఎక్కువే చేసారు. మాములుగా అయితే ఇలాంటి సమయంలో అంతచేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేసే బదులు కరోనా పట్ల ప్రజలని అప్రమత్తం చేసే కార్యక్రమం చేసి ఉంటే బాగుండేది.
ఇక ఈ ట్రోల్స్ జగన్ కు మాత్రమే పరిమితం కాలేదు. చంద్రబాబుపై కూడా జరిగాయి. తాజాగా ఆయన కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలిచారు. సీఎంఆర్ఎఫ్కు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలజీతం విరాళంగా అందించాలని నిర్ణయించారు. వ్యక్తిగతంగా తన కుటుంబం నుంచి రూ. 10లక్షలు విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాధి నిరోధానికి, బాధితుల సహాయానికి ఈ మొత్తం వినియోగించాలని చంద్రబాబు కోరారు.
అయితే చంద్రబాబు సాయంపైన కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. మరి చంద్రబాబు పేదోడు కదా, అందుకే ఆయన 10 లక్షలు ఇచ్చాడంటూ, వెటకారంగా మాట్లాడుతున్నారు. ఎన్నో వేల కోట్లు తినేసి 10 లక్షలు ఇస్తారా అంటూ మరికొందరు వైసీపీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ట్రోలింగ్స్, రాజకీయాలు చేయడం అంత మంచిది కాదని న్యూట్రల్ వ్యక్తులు అంటున్నారు. చంద్రబాబు అయినా, జగన్ అయినా ఈ విధంగా ట్రోల్స్ చేయడం మంచి పద్ధతి కాదని సూచిస్తున్నారు.