కరోనా కట్టడి కోసం అన్ని ప్రభుత్వాలు తమ వంతు పోరాటం చేస్తున్నాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు తమ వంతుగా కరోనా వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే సమన్వయలోపం కారణంగా కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్ హాస్టళ్లలో నివశిస్తూ ఏపీ వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరికి నరకం కనిపించింది.
చివరకు ఇద్దరు సీఎంలు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించారు. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో తెల్లవారుజాము నుంచి వేలాది మంది ప్రయాణికులు నిలిచిపోయారు. అయితే ఇప్పటికీ ఏపీ మాత్రం కఠిన నిబంధనలే అమలు చేస్తోంది. ఏపీలో అడుగు పెట్టాలంటే క్వారంటైన్లో ఉండాలని తేల్చి చెబుతోంది. తెలంగాణ నుంచి ఏపీ వచ్చే వారిని నిబంధనల ప్రకారం వెంటనే ఊర్లలోకి అనుమతించలేమని ఏపీ పోలీసులు తేల్చి చెబుతున్నారు. వారు కచ్చితంగా క్వారంటైన్ లోకి వెళ్లాలని.. ఆ గడువు తర్వాత మాత్రమే వారు ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని ఖరాఖండీగా చెబుతున్నారు.
ఎవరైతే క్వారంటైన్కు అంగీకరిస్తారో వారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తామని ఏపీ పోలీసులు స్పష్టం గా చెబుతున్నారు. రెవెన్యూ అధికారులను కూడా సరిహద్దు వద్దకు పంపిస్తున్నట్టు చెప్పారు. అంతే కాదు.. ఏపీ, తెలంగాణ సరిహద్దులకు వైద్య బృందాలను పంపిస్తున్నారు. ఏపీలోకి వచ్చేవారికి వైద్య పరీక్షల తర్వాత క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తామంటున్నారు. ఇందుకోసం సరిహద్దుల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ముందుగా ఏపీ కి వస్తున్నట్టు సమాచారం ఇవ్వకుండా రావడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్టు ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఏపీ సర్కారు కరోనా విషయంలో చాలా కఠినంగా నిబంధనలు అమలు చేస్తోంది. అలా చేయడం వల్లే ఏపీలో కరోనా బాధితుల సంఖ్య తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
https://tinyurl.com/NIHWNgoogle
https://tinyurl.com/NIHWNapple