ఎంఐఎంనేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. కరోనా విస్తరిస్తుండటం, వివిధ వర్గాలు ప్రభావితం అవుతున్న తరుణంలో అసద్ కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. ముస్లింలంతా శుక్రవారం సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని అసద్ కోరారు. తమ ఇంట్లోనే నమాజ్ చేయాలని ఎంఐఎంనేత పిలుపు ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో, ప్రజలు ఎక్కువగా గుమికూడిన చోట వ్యాధి విస్తరించే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ సూచన వైరస్ వ్యాప్తిని అరికడుతుందని పలువురు అంటున్నారు.
కాగా, మక్కామసీద్ పెద్ద మహమ్మద్ అబ్దుల్ఖదీర్ సిద్దిఖీ సైతం ఇదే రీతిలో కోరారు. ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని, కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే మసీదుల్లో సామూహిక ప్రార్థనలకు దూరంగా ఉండాలని కోరారు. కరోనా నియంత్రణలోకి వచ్చా క తిరిగి ప్రారంభమవుతాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, వక్ఫ్బోర్డు కార్యాలయంలో వక్ఫ్బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం మీడియాతో మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడుతున్నారని, ముస్లింలు కూడా సహకరించాలని కోరారు. తమ ఇళ్లలోనే నమాజ్ చేయాలని, సామూహిక ప్రార్థనలు చేయకూడదని మౌజన్, ఇమామ్లు.. మిగిలినవారికి అర్థమయ్యేలా చెప్పాలని విన్నవించారు. రంజాన్ సమయంలో ఇచ్చే జకాత్ (దానం)ను ప్రస్తుతం కూడా అందజేయాలని సూచించారు. కాగా, కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ ఖమరుద్దీన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలను పాటించాలని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని కోరారు.
ఇదిలాఉండగా, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బీఆర్కే భవన్లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత పెరిగితే అవసరమయ్యే దవాఖానలు, సిబ్బం ది, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచడంపై చర్చించారు. కొవిడ్- 19 రాష్ట్రంలో రెండోదశలో ఉన్నందున మరింత విస్తరించే పరిస్థితి రాకుండా వైద్యవిభాగాలు అప్రమత్తం కావాలని, అందరికీ సెలవులు రద్దుచేయాలని ఆదేశించారు.