కరోనా వైరస్ కలవరం కొనసాగుతోంది. అహర్నిశలూ శ్రమిస్తూ వైద్య సేవలందిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి కృతజతలు తెలుపుతూ ‘జనతా కర్ఫ్యూ’ రోజు చప్పట్లు కొట్టి వారికి సంఘీభావం తెలిపారు. దేశమంతా తమదైన స్థాయిలో సంఘీభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు సంఘీభావం తెలిపినా...తాజాగా వైద్యులు మాత్రం ఊహించని రీతిలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరోనా వ్యాధిగ్రస్తులు తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలోని ముంబైలో కింగ్ ఎడ్వార్డ్ మెమోరియల్ (కెఇఎమ్) హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది. కరోనా పేషంట్లకు వైద్యం చేసే సమయంలో డాక్టర్లకు రక్షణ కల్పించే డ్రెస్ కోడ్, మాస్కులు లాంటి ముఖ్యమైన సదుపాయాలు కూడా లేకపోవడం బాధాకరమైన విషయం. అయినప్పటికీ డాక్టర్ల ప్రాణాలను లెక్క చేయకుండా వైద్యం చేస్తున్నారు. సంరక్షణ కల్పించే డ్రెస్ ధరించి ఒకసారి ఐసోలేషన్లోకి ప్రవేశించిన తర్వాత ఆరు గంటల వరకు మంచినీరు తాగకూడదు. అలాగే వాష్రూమ్కి కూడా పోకూడదు. ఇలాంటి తరుణంలో వారి ఆహారాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా అన్ని హోటల్స్కు మూతబడ్డాయి. ఇంటి నుంచి భోజనం రావాలంటే చాలా దూరం. అందుకని పాలు, బిస్కెట్లతోనే కడుపు నింపుకొంటున్నారు. వారికి మనవంతు సాయం చేయాలంటూ ముంబైలోని తాజ్ హోటల్ హాస్పిటల్లోని సిబ్బందికి ఫుడ్ ఫ్యాకెట్స్ అందిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే...కరోనా పేషంట్ల నుంచి డాక్టర్లకు కూడా వచ్చే ప్రమాదం ఉంది అని లేఖలో విన్నపించింది. అంతేకాదు మాకు చప్పట్లు కొట్టడమే కాదు సంరక్షణ కల్పించే మాస్కులు, ఆహారం కూడా అందించాలని కోరుతున్నారు.
ఇదిలాఉండగా, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలుచేస్తున్నప్పటికీ..కొత్త వైరస్ నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనాను ఎదుర్కొనేందుకు మహారాష్ర్ట ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ముందు జాగ్రత్తగా ప్రత్యేకంగా క్వారంటైన్ గదులను కూడా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ, తాజాగా ముంబైలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వశి ప్రాంతంలో మరో కేసు నమోదైంది. తాజాగా నమోదైన కేసులతో మహరాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 153కు చేరుకుందని వైద్యారోగ్య శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.