తెలంగాణ లో ఇప్పటి వరకు 63 మంది కరోనా బారిన పడగా , ఒక వ్యక్తి కి పూర్తిగా నయమైందని , మరో పదిమందికి నెగిటివ్ అని తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిఈటల రాజేందర్ తెలిపారు . నిబంధలు ప్రకారం మరొకసారి ఆ పదిమందికి పరీక్షలు నిర్వహించనున్నట్లు , అప్పుడు కూడా నెగిటివ్ అని నిర్ధారణ అయితే వారిని ఇంటికి పంపించనున్నట్లు చెప్పారు . ఇక శనివారం ఒకే కుటుంబానికి చెందిన ఆరు మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది . కుటుంబ పెద్ద ఇటీవల ఢిల్లీ వెళ్లి రాగా, ఆయనతోపాటు కుటుంబ సభ్యులు కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు .
తెలంగాణ లో కరోనా బాధితుడు ఒకరు మృతి చెందాడు . ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందిన 74 ఏళ్ల వృద్ధుడి రక్త నమూనాలు పరీక్షించగా, కరోనా పాజిటివ్ గా తేలిందని ఈటల రాజేందర్ తెలిపారు . ఇటీవల ఒక మత కార్యక్రమం లో పాల్గొనేందుకు ఢిల్లీ కి వెళ్లి వచ్చిన ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన సదరు వృద్ధుడు , జలుబు , దగ్గుతో ప్రైవేట్ ఆసుపత్రి లో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు . ఇకపోతే తెలంగాణాలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు .
గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 1500 ఐసోలేషన్ చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు . కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వతేదీ వరకు ప్రకటించిన లాక్ డౌన్ విజయవంతం చేయాలని, ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని ఈటల రాజేందర్ కోరారు . అయితే సోషల్ మీడియా లో కొంతమంది సైకోలు , శాడిస్టులు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు .