ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోన్న కరోనా దేశ ప్రజలను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది . కరోనా కట్టడికి సామాజిక దూరమే శరణ్యమని భావించి ప్రధాని మోదీ , వచ్చే నెల 14 వ తేదీ వరకు దేశ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెల్సిందే . ఈ సందర్బంగా కరోనాపై పోరు కు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చిన మోదీ, ప్రధానమంత్రి సహాయనిధి కి విరివిగా విరాళాలు అందజేయాలని కోరారు . ప్రధాని పిలుపు తో వ్యాపార దిగ్గజాలు , సినీ , రాజకీయ ప్రముఖులు తమ వంతు సహాయాన్ని ప్రకటించారు . ఇక టాటా సన్స్ 1000 కోట్లు , టాటా ట్రస్ట్ 500 కోట్ల విరాళాన్ని ప్రకటించి తమ పెద్ద మనస్సును చాటుకున్నారు .
సినీ హీరో అక్షయ్ కుమార్ కూడా 25 కోట్ల విరాళాన్ని ప్రకటించగా , టాలీవుడ్ హీరోలు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తమవంతు విరాళాన్ని అందజేసి , తమ సామాజిక బాధ్యతను నిర్వర్తించారు . అయితే ఇదే సామాజిక బాధ్యత క్రికెట్ బోర్డు కు... క్రికెట్ క్రీడాకారులకు లేదా ? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది . దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయం లో , ఐపీల్ వంటి వ్యాపారాత్మకమైన టోర్నమెంట్ నిర్వహిస్తూ వేలకోట్ల రూపాయలు గడిస్తోన్న క్రికెట్ బోర్డు భురి విరాళాన్ని అందజేయకపోవడం పట్ల నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదిక తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు
బీసీసీఐ ఈ విపత్కర పరిస్థితుల్లో కేవలం 50 కోట్ల విరాళాన్ని ప్రకటించడం పట్ల మండిపడుతున్నారు . ఇక ఆదాయ ఆర్జన లో టాప్ త్రీ లో ఉండే ధోని కేవలం లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించడం పట్ల కూడా నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు . ధోని కంటే 10 లక్షల విరాళాన్ని ప్రకటించిన రహానే నయమంటూ కామెంట్ చేస్తున్నారు .