కరోనా వ్యాధి ఎంతగా జనాలకు సుపరిచితం అయిందో...ఆ మహమ్మారి మొదటగా బయటపడిన వుహాన్ నగరం సైతం అంతే పాపులర్ అయింది. చైనాలో గతేడాది డిసెంబర్ చివర్లోనే కరోనా కేసులు వెలుగు చూశాయి. చైనాలో మొత్తం 81 వేల మందికి పైగా కరోనా సోకగా, కేవలం 3,300 మంది మాత్రమే అసువులు బాసినట్టు అధికారికంగా వెల్లడిస్తోంది. అయితే, వూహాన్ స్థానికుల కథనం మరోలా ఉందని వార్తా సంస్థలు చెబుతున్నాయి. మొత్తంగా చైనా కుట్రలు బట్టబయలు అవుతున్నాయి.
వూహాన్ రాష్ట్రంలోని పరిస్థితులు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. జనవరి 23వ తేదీ తర్వాత మార్చి 25 మధ్య కాలంలో వూహాన్ మొత్తాన్ని నిర్బంధించారు. పురుగు కూడా కదలకుండా కట్టుదిట్టం చేశారు. గ్రీన్ సర్టిఫికెట్ లభించిన వారందరూ మార్చి 25వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రావిన్స్ను వీడేందుకు అనుమతి లభించింది. దీంతో వేలాదిగా వలసబాట పట్టారు. అయితే, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఏప్రిల్ 5న అక్కడ కింగ్ మింగ్ అనే ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు తమ పూర్వీకుల సమాధుల వద్ద వారు ప్రార్ధనలు జరుపుకుంటుంటారు. అయితే, మార్చి 25 తర్వాత ఏప్రిల్ 5వ తేదీ లోపు కరోనా వైరస్తో చనిపోయిన వారి అస్థికల కుండలను అందజేస్తామని స్థానికులకు అక్కడి అధికారులు తెలిపారు. వూహాన్లో మొత్తం ఏడు దహనవాటికలు నిర్విరామంగా పనిచేశాయి. వాటిలో హాంకో, వుచాంగ్, హాన్యాంగ్ దహనవాటికలు చాలా పెద్దవి.
అసలు రక్త పరీక్షలు కూడా నిర్వహించకుండానే అనేకమంది వారి ఇళ్లలోనే చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా వారికి శవపరీక్షలు నిర్వహించకుండానే దహనం చేసేశారని స్థానికులు చెబుతున్నారు. ఏప్రిల్ 5వ తేదీ లోపు అంటే 12 రోజుల్లోనే ప్రతి రోజు దాదాపు 3500 అస్థికల కుండలను స్మశాన వాటికల నుంచి ఆయా కుటుంబాలకు అందించినట్టు స్థానికులు వెల్లడిస్తున్నారు. అంటే, సుమారు 42 వేల మందికి ఆయా స్మశాన వాటికల్లోనే దహనం చేసినట్టు వూహాన్ వాసుల కథనం. అంతకుముందు వేలాదిగా ఆయా స్మశాన వాటికలకు అస్థికల కుండల సరఫరా జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. స్మశాన వాటికల్లో కాపరులు నిర్విరామంగా పనిచేస్తూనే కనిపించారు. కేవలం మూడు వేల మంది మాత్రమే చనిపోయినట్టు చెప్పడం ఏమాత్రం నిజం కాదని స్థానికులు ఇప్పుడు అక్కడ మీడియాకు చెబుతున్నారు. జనం భయపడిపోతారని అధికారులు వాస్తవాలను దాచి వెల్లడించి ఉండవచ్చు.