ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. అన్ని దేశాలకు విస్తరించినట్టుగానే భారత దేశంలోకి కూడా కరోనా వైరస్ పాకింది. దీంతో దేశంలో లాక్ డౌన్ ను విధించారు. ఇక కరోనా నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని వెల్లడించింది. దీనికి ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) కూడా కేంద్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు రెపో రేటును తగ్గించింది. ఇంకా చాలా నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. తీసుకున్న పలు కీలక నిర్ణయాలలో ఈఎంఐ మారటోరియం కూడా ఒకటి.
కరోనా ప్రభావం వలన ఈఎంఐ 3 నెలలు కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించింది. దీంతో ఈఎంఐ చెల్లించాల్సిన వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే.. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ నిర్వహించారు. పలు కంపెనీలకు సెలవులు ప్రకటించారు కూడా. దీంతో ఆదాయం లేకపోవటంతో ఈఎంఐ కట్టలేని పరిస్థితి. 3 నెలలు లోన్ కట్టాల్సిన అవసరం లేదని ఇప్పుడిప్పుడే నిమ్మలపడుతున్న నేపధ్యంలో ఆర్థిక సంస్థలు కస్టమర్లకు మెసేజ్ లు పంపుతూ షాక్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకూ.. ఆర్బీఐ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు.
కావున నెలాఖరు దగ్గరికి వస్తుండటంతో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఈఎంఐ కి తగినంత డబ్బు ఉంచుకోమని మెసేజ్ ల ద్వారా చెప్తున్నారు. దీంతో లోన్ తీసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. అసలు ఆర్బీఐ ప్రకటన ప్రకారం.. లోక్ ఏరియా బ్యాంక్స్, అన్ని వాణిజ్య బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, మైక్రో ఫైనాన్స్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, కో ఆపరేటివ్ బ్యాంక్స్, పలు కంపెనీలకు చెందిన కస్టమర్లు ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించాయి.
క్రెడిట్ కార్డు బకాయిలు కూడా ఈఎంఐ మారటోరియం కిందకు వస్తాయని ఆర్బీఐ తెలిపింది. అలాగే.. ఆర్బీఐ టర్మ్ లోన్స్ కు అనగా.. హోమ్ లోన్స్, వెహికిల్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ వంటి వాటికి ఈఎంఐ మారటోరియం వర్తిస్తుంది. దీంతో పాటుగా కన్సూమర్ డ్యూరబుల్ లోన్స్.. అంటే స్మార్ట్ఫోన్, టీవీ, ఫ్రిజ్ వంటి వాటికి ఈఎంఐ చెల్లించనవసరం లేదు.