ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఏపీలో కూడా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే ఏపీలో 23 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అయితే ఈ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తోంది. ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు తెచ్చుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే చూసుకుంటూ, లాక్ డౌన్ అమలు చేస్తుంది. ఇక ఈ సమయంలో ప్రతిపక్షాలు కూడా పెద్దగా రాజకీయాల జోలికి పోకుండా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సలహాలు ఇస్తున్నారు.
మొదట్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కాస్త విమర్శలు చేసినా, ఇప్పుడు అవి కూడా తగ్గించేసి ప్రభుత్వానికి సమస్యలు ఉంటే చెబుతున్నారు. పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే అందరూ కలిసి ఇలా కరోనా మహమ్మారిని ఎదురుకోవాల్సిన సమయంలో ఓ ఇద్దరు నేతలు మాత్రం గట్టిగానే రాజకీయం చేస్తున్నారు. అధికార వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు దారుణమైన విమర్శలు చేస్తున్నారు.
తాజాగా విజయసాయి, చంద్రబాబు టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు. ఈ మధ్య చంద్రబాబు పెద్దగా రాజకీయాలు మాట్లాడకపోయిన విజయసాయి మాత్రం కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు. చంద్రబాబు తన రాజకీయ మనుగడ కోసం ప్రజల్ని బలిపెట్టేరకమని, జనం నిత్యం ఏదో ఒక ఉపద్రవంలో చిక్కుకుని కొట్టుమిట్టాడాలనేదే ఆయన సహజ స్వభావమని మాట్లాడారు. హైదరాబాద్ లో ఉంటూ కూడా బాబు ఏపీపై కుట్రలు పన్నుతున్నారని విజయసాయి ఆరోపించారు.
ఇక విజయసాయి ఇలా మాట్లాడిన వెంటనే బుద్దా వెంకన్న లైన్లోకి వచ్చేశారు. జగన్ టార్గెట్గా విమర్శలు చేసేశారు. తండ్రి శవం దొరక్కముందే ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసి సంతకాలు సేకరించి శవాలపై పేలాలు ఏరుకున్నది ఎవరు ? అంటూ జగన్పై మండిపడ్డారు. వాలంటీర్ల పేరుతో వైకాపా కార్యకర్తలకు నెలకు 400 కోట్లు ప్రజా ధనం దోచిపెడుతున్నారు అని ఆరోపణలు చేశారు. అయితే ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు నేతలు ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సమంజసం కాదు. అందరూ ఏకమై కరోనాపై పోరాడాల్సిన సమయంలో వీరు రాజకీయాలు చేయడం శోచనీయం.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
Apple : https://tinyurl.com/NIHWNapple