కోవిడ్-19 మొదట చైనాలో బయిటపడిన మాట నిజమే. వైరస్ మొదట ఎక్కడో ఒక చోట సోకితే ఆ దేశమే సృష్టించిందని నిందించడం కూడా సహజమే .. కరోనా వైరస్ను మొదట 2019 డిసెంబరులోనే చైనా కనుగొన్నది.. అయితే దాని తీవ్రతను గుర్తించడంలోనే లోపం జరిగింది. కొద్ది కాలంలోనే ప్రమాదాన్ని పసిగట్టి శరవేగంగా వైద్యశాలలు నిర్మించడం, 40 వేలమంది డాక్టర్లను మొహరించడం, ఇళ్లలోనే పరీక్షలు, చికిత్స చేయడం ద్వారా చైనా రెండు నెలల్లోనే వుహాన్ రాష్ట్రాన్ని కరోనా నుంచి విముక్తి చేయగలిగింది. ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉండటం, వనరులను వేగంగా స మీకరించే శక్తి, సమాజం కోసం పని చేసే లక్షణం అన్నీ కలిసి ఈ ఫలితాలిచ్చాయనేది విశ్లేషకుల మాట.
ప్రపంచమంతా మాయదారి వైరస్ ఎక్కించి, ఇప్పుడు తన పని తాను చేసుకుంటోందని ప్రపంచ దేశాలు చైనాపై దుమ్మెత్తి పోశాయి. అగ్రరాజ్యం అమె రికా ఒక అడుగు ముందుకేసి , ఇది చైనా వైరస్ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పుబట్టింది. అమెరికా ఆరోపణలు అందిపుచ్చుకుని ఇండియాలోనూ ఈ వ్యతిరేక ప్రచారం జోరుగా సాగింది. ఇక్కడి పత్రికలు, ఛానెళ్లతోపాటు సామాజిక మాధ్యమాల్లో నూ చైనాకు వ్యతిరేకంగా ఒక విధమైన ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిజానికి అక్కడ వాళ్లు ఏం చేశారు.. నియంత్రణలు ఎలా పాటించారు అన్న విషయాలపై ఎవరూ దృష్టిపెట్టలేదు. ఇప్పుడు చైనా మనకు శత్రువా కాదా అన్న చర్చ కాదు. అసలీ పరిస్థితుల్లో మనమేం చేయాలి, మన్నల్ని మనం ఎలా కాపాడుకోవాలి .
ఇవన్నీ పక్కన బెడితే దేశాన్ని అతలాకుతలం చేస్తున్న లాక్డౌన్ మనముందుకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. అదే వలస కార్మికుల సమస్య. లాక్ డౌన్ నేపథ్యంలో పరిశ్రమలన్నీ మూత పడ్డాయి. దీంతో బీహార్, యూపీ, బెంగాల్, ఒడిశాతోపాటు చాలా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులు తాము పని చేసే ప్రాంతాల నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అయితే లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వారంతా తిరిగి రాకపోతే చాలా రంగాలు ఖాయిలా పడటం ఖాయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయా రంగాలు కుప్పకూలిపోతాయి. ఇవ్వన్నీ వదిలేసి మనం వాడెవడో చైనా వాడు ఇంకెవడో పాకిస్థాన్ వాడంటూ పిచ్చి లెక్కలతో పిచ్చి రాతలతో కాలం వెళ్లదీస్తుండటం శోచనీయం.
నిజానికి చైనా మన మీద శాపనార్థాలేమీ పెట్టలేదు. వాళ్ల మీడియాలో అక్కడక్కడ ప్రధాని మోడీపై కొన్ని ఆసక్తికర వార్తలు మాత్రమే కనిపిస్తాయి. ము ఖ్యంగా మోడీ ఆధ్వర్యంలో దిగజారిన భారత్ దేశ ఆర్థిక పరిస్థితి గురించి.. ఐదేళ్లలో ఐదు శాతం కిందకు పడిపోయిన జీడీపీ గురించి చైనీస్ మీడియా రాసింది. అంతేగాక తన వైఫల్యాల కప్పిపుచ్చుకోడానికి మోడీ ఒక జాతీయ వాదాన్ని ఎగదోస్తున్నారన్నది అక్కడి పత్రికల్లో కనిపించిన ఒక వ్యాఖ్య. నిజానికి అది ఇక్కడి మన దేశపు మీడియాలో, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారణమైన వార్తలు, వ్యాఖ్యలే..