ఢిల్లీ శివారు నిజాముద్దీన్ లో జరిగిన మర్ఖజ్ ప్రార్థనల్లో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారని , ఇప్పుడు వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . తెలంగాణ లో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన ఆరు మంది , ఢిల్లీ లో జరిగిన మర్ఖజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారే కావడంతో విశేషం . మృతి చెందిన వారి కుటుంబ సభ్యులతో పాటు , వీరు ఎవర్ని కలిశారు ... ఎక్కడెక్కడ తిరిగారన్న దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది . దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది .
మర్ఖజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి వల్ల పలువురికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడంతో , ఇక ఏమాత్రం ఉపేక్షించి లాభం లేదని భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మర్ఖజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరించే ప్రయత్నాన్ని ప్రారంభించింది . ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు రాష్ట్ర నుంచి దాదాపు 300 పైచిలుకు మంది , ఈ ప్రార్థనల్లో పాల్గొని రాష్ట్రానికి తిరిగి వచ్చారు . హైదరాబాద్ నుంచి అత్యధిక సంఖ్యలో 186 మంది మర్ఖజ్ ప్రార్థనల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది . ఆ తరువాత ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి దాదాపు 55 మంది మేరకు మర్ఖజ్ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు .
మహబూబ్ నగర్ , కరీంనగర్ నుంచి , వరంగల్ నుంచి కూడా దాదాపు పాతిక మందికి తగ్గకుండా ప్రార్ధన సమావేశాలకు హాజరయినట్లు తెలుస్తోంది . ఇతర జిల్లాల నుంచి కూడా పదుల సంఖ్యలో మర్ఖజ్ ప్రార్థనల్లో భక్తులు పాల్గొన్నారని గుర్తించిన అధికారులు , ఇప్పుడు వారిని ట్రేస్ చేయడమే కాకుండా , వారు ఎవరెవర్ని కలిశారో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు .