కరోనాతో ప్రపంచమంతా కలవరపడుతూ రోజు రోజూ దిన దిన గండంలో ప్రజలు బ్రతుకుతున్నారు. ఈ వ్యాధి ఎలా పోతుందో ఏంటో కూడా అర్ధం కాని పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వం అటు వైద్య నిపుణులు..శాస్త్రవేత్తలు దీని నివారణ మందు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ విషయం పై ప్రజల్లో అవగాహన తీసుకువస్తున్నారు. దీని పై ముఖ్యంగా శరీర శుభ్రత అన్నది చాలా ముఖ్యమని చెబుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ స్వయ నిర్బంధనలో ఉండడం వల్ల మనం ఈ వ్యాధిని అరికట్ట వచ్చంటున్నారు. ఇది అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి సోకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాపం ఇటు పోలీసులు, జిహెచ్ఎంసీ వాళ్ళు, మీడియా అందరూ కలిసి రోడ్ల మీద ఎవరి పనులు వారు నిర్వర్తిస్తూ నానా తంటాలు పడుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే... ఎవ్వరూ కూడా ఇళ్ళలోంచి బయటకు రాకపోవడంతో ఎక్కువగా భార్యాభర్తలిద్దరూ కూడా ఇళ్ళకే పరిమితమయ్యారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ మహిళలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. గృహ హింసకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్కు అందిన ఫిర్యాదులు చూస్తుంటే అవునని అనిపించకమానదు. మార్చి 24 నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్సీడబ్ల్యూకి గృహ హింసకు సంబంధించి 58 ఫిర్యాదులు అందాయి. అంటే ఇళ్ళలోనే ఉంటూ భర్తలు భార్యలకు హింస చూపిస్తున్నారు. ఇంట్లో ఉంటూ వారికి ఏమి తోచక వారిని హింసించడంతో అధిక సంఖ్యలో ఇలాంటి కేసులు చాలా వస్తున్నాయి.
వీటిలో అత్యధికం ఉత్తరాది రాష్ట్రాల నుంచే కావడం గమనార్హం. ఇంట్లో ఉంటున్న పురుషులు తమ అసహనాన్ని భార్యలపై చూపిస్తూ హింసకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తమకు అందిన ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం పంజాబ్ నుంచే వచ్చినట్టు రేఖాశర్మ పేర్కొన్నారు. ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇక పోలీసులకు ఈకరోనా కేసులన్ని చూడాలో లేక ఈ గొడవలు చూడాలో అర్ధం కాక సతమతమవుతున్నారని చెప్పాలి.