లోకంలో కరోనా ప్రజలను ఒకే దారిలో కాకుండా, వివిధ మార్గాల్లో చంపుతుంది.. అంటే కరోనా లక్షణాలతోనే కాకుండా, జనులు వివిధ రుగ్మతలతో మరణిస్తున్నారని అర్ధం.. ఇప్పటికే కరోనా భయంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటుండగా, మరికొందరు లాక్డౌన్ నేపధ్యంలో తాగడానికి కల్లు దొరక్క మానసికంగా పిచ్చివారిలా మారి చస్తున్నారు.. కాగా ఇంకొందరు ఆకలి బాధతో ప్రాణాలు విడుస్తున్నారు.. ఇదంతా పక్కన పెడితే కరోనా వైరస్ సోకి మరింతగా చనిపోతున్నారు.. అంటే లోకంలో ఎక్కడ చూడు చావు వార్తలు తప్పితే మరే విషయాలు వినిపించడం లేదు..
ఇలాంటి సమయంలో మరికొంత మంది యువకులు కూడా మూర్ఖత్వంతో ప్రవర్తించి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు.. ఇకపోతే కొందరు యువకులు మద్యం షాపులు మూతపడడంతో శానిటైజర్లో ఉపయోగించే ప్రొపిల్ ఆల్కహాల్ను సేవించగా ఒకరు మరణం, ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడ్దది.. ఆ వివరాలు తెలుసుకుంటే.. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ధర్నాల నవీన్ మూర్తిరాజు (22), అదే గ్రామానికి చెందిన అల్లాడి వెంకటేష్, ఇరగవరం మండలం కావలిపురం గ్రామానికి చెందిన పండూరి వీరేష్, తణుకు దుర్గారావు, విప్పర్తి శ్యాంసుందర్, ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన కావలిపురపు వెంకట దుర్గాప్రసాద్ వీరంతా మిత్రులు.
కాగా మద్యానికి అలవాటుపడిన వీరు, బయట దొరక్కపోవడంతో దీనికి ప్రత్యామ్నాయంగా, తణుకు మండలం పైడిపర్రులోడు అంబికా కెమికల్స్లో ఈనెల 29వ తేదీ ఆదివారం ఏలూరు నుంచి సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం లోడ్ వచ్చిందని తెలుసుకున్నారు.. అదేసమయంలో ఆ షాపు ఓనర్ వీరేష్ను టిన్నులు దించడానికి పిలిపించాడు.. అయితే ఆదివారం ఉదయం లోడ్ దించిన తర్వాత అక్కడే శానిటైజర్లో ముడిపదార్థంగా ఉపయోగించే ఐసో ప్రొపిల్ ఆల్కహాల్ను 400 మిల్లీలీటర్లు బాటిల్లో వీరేష్ పట్టుకెళ్లాడు. కాగా అదే రోజు మధ్యాహ్నం తన మిత్రులకు ఫోన్ చేసి శానిటైజర్ తయారు చేసుకుందాం రమ్మని పిలవగా.. అతని స్నేహితులంతా కావలిపురం చెరువు దగ్గర కలుసుకుని, వీరేష్ తీసుకువచ్చిన రసాయనం మందు వాసన వస్తుండటంతో వీరంతా కలిసి దాన్ని స్ప్రైట్లో కలుపుకుని తాగారు.
మరుసటి రోజు నవీన్మూర్తి రాజు పరిస్థితి విషమిచండంతో తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలోపే అతను మరణించాడు.. ఇక వెంకటేష్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనుమానంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయట పడింది. ఇక వీరేష్ పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో తణుకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాపు చేపట్టారు.