ప్రస్తుతం కరోనా రాష్ట్రంలోని ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఈ సమయంలో ప్రజలు రాజకీయాలు కోరుకోవడం లేదు. తమ కు ఎవరైనా మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. తమ పాలిట ఆపద్భాంధవులై ఆదుకుంటే చాలని అంటు న్నారు. అంతేకాదు, ఇప్పుడు కరోనాతో ఇబ్బంది పడుతామని బయటకు రావడం లేదు. ఇది పోయాక మా బతుకుల పరిస్థితి ఏంటి? మా ఉపాధి ఏమవుతుంది? అని ఆక్రోశిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా రాజకీయాలకు మీడియాలోను, ప్రధాన పత్రికల్లోనూ చోటు ఉండడం లేదు. ఏ నాయకుడు కూడా విమర్శలు, రాజకీయాలు చేయడం లేదు. చేతనైనంత సాయం చేస్తున్నారు. ప్రజలకు ఏదో ఒక రూపంలో సందేశాలు పంపుతున్నారు.
కానీ, ఏపీలో మాత్రం చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. తాను ఇవ్వాలనుకున్నది ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం పట్టు మని మూడంటే మూడు రోజులు మాత్రమే తన రాజకీయ విమర్శలకు తాళం వేశారు. మరి ఈ మూడు రోజుల్లోనూ ఆయన నిద్ర పోయారో.. లేదో(అంటే.. నిత్యం జగన్పైనా, ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయందే బాబుకు నిద్రపట్టడం లేదట!). ఇప్పుడు మాత్రం మళ్లీ తన రాజకీయ స్వరూపాన్ని చూపించారు. ఏపీ ప్రభుత్వం కరోనా పరీక్షలు సరిగా చేయడంలేదని చంద్రబాబు అ న్నారు. టెస్ట్లు చేయకపోవడం వల్ల కరోనా వ్యాప్తి పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. లోకల్ ట్రాన్స్మిషన్ను కంట్రోల్ చేయక పోతే కష్టమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 9 లేఖలు రాశామని చెప్పారు.
అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడుతోందన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.. రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతిందని చంద్రబాబు స్పష్టం చేశారు. మాస్క్లు, శానిటైజర్లు అందించలే కపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా పరీక్షా కేంద్రాలు తక్కువగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం కౌన్సిలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలను ప్రభుత్వం చాలా తక్కువగా చేసిందని కరోనా కట్టడి కావాలంటే నిర్థారణ పరీక్షా కేంద్రాలను వీలైనన్ని ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపట్ల ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని, లాక్డౌన్ కారణంగా మానిసిక ఆందోళనలకు గురికా కుండా వారికి ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించాలని చంద్రబాబు అన్నారు. అయితే, సూచనల మాటున చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడడాన్ని ఓ వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనూ ఇంకా లోపాలు వెతకడం సరికాదని అంటున్నారు.