కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రజలందరూ బాధ్యతగా లాక్డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వ ప్రకటిత స్వీయ నిర్బంధంలో మనకు ఎన్నో విషయాలు తెలిసివస్తున్నాయి. ముఖ్యంగా ఇంటిలో ఆడబిడ్డల కష్టాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. తల్లి, చెల్లి, భార్య ఏ విధంగా కష్టపడుతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. కరోనా మహమ్మారి విజృంభన కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఈ అవకాశం దక్కుతోంది. అయితే, కేవలం తెలుసుకోవడమేనా? ఇంకేమైనా చేయగలమా? అంటే చేయగలం అంటున్నారు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.
ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న మగవాళ్లకు ఆయనకు ఓ సూపర్ ఐడియా ఇచ్చారు. ఖాళీగా ఉండి బోర్ కొట్టకుండా, ఎప్పుడూ ఇంటి పనులతో బిజీగా ఉండే ఆడవాళ్లకు కాస్త ఊరట కలిగించేలా ఆయన ఓ సూచన చేశారు. లాక్డౌన్ అమల్లో ఉన్నన్ని రోజులు ఇంట్లో ఆడవాళ్లపై పనిభారం మోపవద్దని, మగవాళ్లు కూడా ఇంటి పనుల్లో వారికి సాయం చేయాలని ఒడిశా సీఎం సూచించారు. లాక్డౌన్ సమయంలో మగవాళ్లు ఇంట్లో తీరిగ్గా కూర్చొని ఆడవాళ్లకు అది వండు, ఇది వండు అంటూ ఆర్డర్లు వేస్తూ ఎక్కువసేపు వంటింట్లో మగ్గేలా చేయవద్దని, మగవాళ్లు కూడా వారికి చేదోడువాదోడుగా ఉండాలని ఒడిశా సీఎం చెప్పారు. రోజురోజుకు వేసవి తాపం పెరుగుతున్నందున మహిళలు ఎక్కువసేపు వంటింట్లో ఉంటే కుంగిపోతారని, మహిళలు కుంగిపోతే దేశం కూడా కుంగిపోతుందని, అందుకే మగవాళ్లు ఇల్లాలి కష్టాల్లో పాలు పంచుకుని మమకారం చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశా సీఎం సలహా ఆడవాళ్లకు ఎంతో నచ్చేది అనే సంగతి తెలిసిందే. అయితే, దీన్ని మగవాళ్లు కూడా పాటిస్తే మంచిది కదా? ఏమంటారు.
కాగా, లాక్డౌన్ గురించి కొందరు ఆసక్తికరంగా వివరిస్తున్నారు. జీవితంలో నిజమైన ఆనందాలు, ఇంటి విలువ ఏమిటో ఈ వారం రోజుల్లోనే తెలిసిందని అంటున్నారు. ఆహార పదార్థాల పొదుపు గురించి, మన సన్నిహితుల ఆరోగ్యం గురించి వివరంగా తెలుస్తోంది. ఇప్పుడు అవసరమైనంత మేరకు మాత్రమే ఆహారాన్ని తయారు చేసుకోవాలని తెలుసుకుంటున్నామని అంటున్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల కోసం మన సన్నిహితులు తరచుగా బయటకు వెళ్లడం వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. అందుకే వారిని ఎక్కువగా బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నామంటున్నారు. నిత్యావసర వస్తువుల్ని మితంగా వాడుతున్నామని కూడా చెప్తున్నారు.