భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యను ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ఉదంతానికి ముందు.. ఆ తర్వాతగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మర్కజ్కు ఇతరదేశాల నుంచి వందలమంది, దేశవ్యాప్తంగా వేలాదిమంది ముస్లింలు హాజరుకావడం, వారితో అమాంతంగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా కలకలం రేగుతోంది. లాక్డౌన్తో కరోనాను కట్టడి చేశామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేగాదు.. సామాన్య ప్రజలు కూడా భావిస్తున్న వేళ.. మర్కజ్ ఘటన దేశాన్ని తీవ్ర ఆందోళనకరంగా మార్చేస్తోంది. కేవలం 15గంటల్లోనే ఏకంగా 228 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కావడం, ముగ్గురు మరణించడంతో కరోనా తీవ్రతకు అద్దంపడుతోందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం ఉదయం వరకు భారత్లో పాజిటివ్ కేసుల సంఖ్య 1,637 ను దాటింది. మరణాల సంఖ్య 38కి చేరుకుంది. ఈ గణాంకాలతో ప్రభుత్వాల్లోనేగాదు.. ప్రజల్లో కూడా ఆందోళన కలుగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 8,00,000 మందికి పైగా కరోనావైరస్ బారినపడగా సుమారు 42,000 కుపైగా మరణాలు సంభవించాయి.
నిజానికి.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బీభత్స సృష్టిస్తుండగా.. భారత్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇక తెలంగాణ తదితరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. సోషల్ డిస్టెన్స్పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాయి. ఇక ఇదే సమయంలో కేంద్రప్రభుత్వం మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించింది. ఆ తర్వాత ఏకంగా ఏప్రిల్ 14వరకు ప్రధాని నరేంద్రమోడీ లాక్డౌన్ ప్రకటించారు. ఇక క్రమంగా భారత్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలిగామని అనుకుంటున్న తరుణంలో మర్కజ్ ఘటన వెలుగు చూడడంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మంది ముస్లింలు మర్కజ్కు హాజరయ్యారు. మర్కజ్ ముగిసిన తర్వాత అందరూ వారివారి సొంతూళ్లకు వెళ్లారు. వీరిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారు. ఇందులో ఒకరు మరణించిన తర్వాత కరోనా పాజిటివ్ అని తేలింది. మిగతా ఐదుగురు కూడా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరు కూడా కరోనాతోనే మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇన్నిరోజులూ కేవలం పట్టణాల వరకే పరిమితమైందనుకున్న కరోనా ఇక గ్రామీణప్రాంతాల్లోకి కూడా చొరబడిందనిపలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మర్కజ్కు హాజరైన వారిలో ఇప్పటికే చాలా మందికి పాజిటివ్ నమోదు అయింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. వారు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎంతమంది స్థానికులను కలిశారన్నది అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో స్థానికుల్లోనూ పాజిటివ్ నమోదు అయ్యే ప్రమాదం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.