కరోనా ప్రభావం నేపథ్యంలో అత్యంత ప్రమాదకర సమయంలో కూడా విధులు నిర్వహిస్తున్న కొన్ని శాఖల ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వం తన ప్రేమను చాటుకుంటోంది. ఉద్యోగుల, ప్రజాప్రతినిధుల జీతాల్లో కోత విధించిన తెలంగాణ ప్రభుత్వం కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, మునిసిపల్ సిబ్బంది, మరియు పోలీసుల జీతాల్లో మాత్రం కోత విధించటం లేదు . అంతే కాదు వారు చేస్తున్న సేవలకు గాను ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనాన్ని చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్కు ఆదేశాలు కూడా జారీ చేశారని సమాచారం.
కరోనా మహమ్మారి ప్రబలకుండా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా సమాజానికి ఎంతో చేస్తున్న మూడు శాఖల సిబ్బందికి పూర్తిస్థాయి జీతాల చెల్లింపు చేపట్టడంతో పాటు నగదు ప్రొత్సాహకాలు ఇవ్వాలనుకోవడంపై రాష్ట్ర ప్రజానీకంలోనూ హర్షం వ్యక్తమవుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయింది. నిధుల రాక నిలిచిపోవడంతో పొదుపు మంత్రం పాటిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల జీతాల్లో 50శాతం కోత విధించిన విషయం తెలిసిందే. ఇక ప్రజా ప్రతినిధుల వేతనాల్లోనూ కోత విధించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన తెలంగాణా ప్రభుత్వం మార్చి నెల జీతంలో సగం జీతాన్ని ఇప్పుడు ఇవ్వనుంది.
మిగతాది తర్వాత ఇవ్వనున్నారు. ఊహించని విధంగా కరోనా పోరాటంలో, అలాగే లాక్ డౌన్ సక్సెస్ కావటంలో తీవ్రంగా కృషి చేస్తున్న మూడు శాఖల ఉద్యోగులకు జీతాలు చెల్లించటమే కాదు వారికి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే ఈ ఇన్సెంటీవ్స్ ఎంత శాతం ఇవ్వాలనేది ఒకటి, రెండు రోజుల్లో పూర్తి స్పష్టతతో ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ తాజా ప్రకటనతో మూడు శాఖల ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీ ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోబోతోందో తెలియాల్సి ఉంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple