ఇప్పటి వరకు కరోనా సృష్టిస్తున్న ఘోరాలు అన్నీ ఇన్నీ కావు.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వేల మరణాలు.. లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో వేలాదిమంది వలస కార్మికులు కాలి నడకన తమ గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి.
తాజాగా ఇప్పుడు ప్రయాణీకులు సంతోషించే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రైల్వే, ప్రైవేటు విమానయాన సంస్థలు శుభవార్తను వెల్లడించాయి. రైల్వే, విమాన ప్రయాణాల కోసం ముందస్తు టికెట్ల బుకింగ్ను ఆరంభించాయి. గురువారం ఉదయం టికెట్ల రిజర్వేషన్లను చేపట్టాయి. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రయాణం సాగించడానికి వీలుగా ఆన్లైన్ల ద్వారా టికెట్లను జారీ చేస్తున్నాయి. లాక్డౌన్ను పొడిగించే అవకాశాలు గానీ, అలాంటి ప్రణాళిక గానీ ప్రస్తుతానికి తమ వద్ద ఏదీ లేదంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ప్రకటించారు.
దేశవ్యాప్తంగా రైల్వేలు, ప్రైవేటు విమానయాన సంస్థల్లో ప్రయాణించడానికి వీలుగా టికెట్ల బుకింగ్ను చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైల్వే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు వేర్వేరుగా ఓ సర్కులర్ను పంపించినట్లు చెబుతున్నారు. ప్రయాణాలు లేక అయిన వారికి దూరమై నానా ఇబ్బందులు పడుతున్న లక్షల మందికి ఇది ఊరట ఇచ్చే విషయం అంటున్నారు.