ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మొదటి కరోనా వైరస్ కేసు బయటపడింది. తిరుపతిలోని త్యాగరాజా నగర్ లో నివాసం ఉంటున్న ఓ యువకుడికి కోరానా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ యువకుడు కూడా ఢిల్లీలోని జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలకు హాజరై వచ్చినట్లు సమాచారం. ఇతను ఢిల్లీకి వెళ్ళి వచ్చిన విషయం తెలియగానే అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతనితో పాటు ఇతన కుటుంబ సభ్యులను కూడా అధికారులు ఐసొలేషన్ వార్డుకు తరలించారు.

 

ఐసొలేషన్ లో ఉన్న యువకుడికి జ్వరం లక్షణాలు బయటపడటంతో వైరస్ పరీక్షలు నిర్వహించారు. దాంతో కరోనా వైరస్ ఉన్నట్లు స్పష్టమైంది.  దాంతో ఉదయమే సంబంధిత అధికారులు బాధితుడి ఇంటికి వచ్చి అతనితో పాటు కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్ సెంటర్ కు తరలించారు.  మొత్తం మీద కరోనా వైరస్ కేసు బయటపడటం ఇదే మొదటిది.

 

వైరస్ కేసు బయటపడటంతో త్యాగరాజా నగర్, మంచాలవీధి, టౌన్ క్లబ్ ఏరియా, గాలి వీధి, తీర్ధకట్ట వీధి, గాంధీ నగర్ తో పాటు భవానీ నగర్ సర్కిల్ ను డేంజర్ జోన్ గా అధికారులు ప్రకటించారు.  ఈ ఏరియాల్లోని జనాలు ఏ టైంలో కూడా అసలు బయటకు రాకూడదంటూ పోలీసులు మైకుల్లో ప్రకటనలు చేస్తుండటంతో జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

 

మామూలుగా తిరుపతికి రోజుకు సుమారు 3 లక్షల మంది వస్తుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వెళ్ళాలంటే తిరుపతిలో నుండే వెళ్ళాలి. దాంతో ప్రపంచం నలుమూలల నుండి పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి తిరుపతిలో ఉండే జనాల రద్దీ మొత్తం తిరుమల రద్దీయే. అలాంటిది గడచిన పది రోజులుగా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ జనాల తాకిడి దాదాపు లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్ధితుల్లో కూడా  తిరుపతిలో మొదటి కేసు బయటపడిందంటే అది ఢిల్లీలోని మత ప్రార్ధనల పుణ్యమే అని చెప్పాలి. తాజాగా బయటపడిన కేసుతో జిల్లాలో కేసుల సంఖ్య 8కి పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: