కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పాలకులు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ను కేంద్ర ప్రభుత్వం విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం దేశ వ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్ డౌన్ను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. అయితే, దీనిపై ఎలాంటి రిలీఫ్ ఇవ్వాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు కఠిన చర్యలు సైతం రెడీ అవుతున్నాయని సమాచారం.
లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎస్ లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సూచిస్తూ జాబితాను రాష్ట్రాలకు పంపారు. లాక్డౌన్ అమలును ఉల్లంఘించే వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద…జరిమానాతో పాటు.. రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని తెలుపుతూ సవివరమైన నిబంధనల లిస్టును కేంద్ర ప్రభుత్వం పంపింది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది.
మరోవైపు, లాక్ డౌన్ అమలు, ముగింపు స్ట్రాటజీ సహా పలు అంశాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ ముగిసిన తర్వాత విడతల వారీగా ఆంక్షలు సడలించాలన్న అభిప్రాయాన్ని పలువురు సీఎంలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో కరోనా కేసుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలన్న ప్రతిపాదించారని సమాచారం. కామన్ ఎగ్జిట్ స్ట్రాటజీ సిద్ధం చేయాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోడీ కోరారు. ప్రజలు ఒక్కసారిగా మళ్లీ రోడ్లపైకి వచ్చేయకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో రానున్న కొద్ది వారాల సమయం చాలా కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాలు టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్ పై దృష్టి పెట్టాలని సీఎంలకు సూచించారు. దేశంలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా చూసుకోవాలని, కూరగాయలు, నిత్యావసర సరుకుల సరఫరా విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ ఎక్యూప్మెంట్, వాటి తయారీకి అవసరమైన వస్తువుల ట్రాన్స్ పోర్ట్ కు అడ్డంకులు లేకుండా చూడాలన్నారు.