తెలంగాణలో రేషన్ కష్టాలు మొదలయ్యాయి. లాక్డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులందరికీ బియ్యం అందజేస్తోంది. ఈక్రమంలో తెల్లవారు జాము నుంచే కార్డుదారులు రేషన్ షాపుల వద్దకు చేరకున్నారు. సామాజిక దూరం పాటిస్తూనే.. బారులు దీరుతున్నారు.
ఇదే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ డౌన్ కావడంతో బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గంటలకొద్దీ క్యూలో వేచి ఉన్న ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. దీంతో మరో సమస్య ఏర్పడుతోంది. పలు చోట్ల కార్డుదారులు సామాజిక దూరం పాటించకుండా గుంపులు, గుంపులుగా పోగవుతున్నారు. ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.
ప్రభుత్వం వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, వలస కూలీలకు 12 కిలోల బియ్యంతోపాటు రూ. 500ల చొప్పున అందజేస్తున్న విషయం తెలిసిందే.