కనిపించని శత్రువుతో ప్రపంచ దేశాలన్నీ ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నాయి. పొరుగు దేశమైన చైనా సృష్టించిన కరోనా వైరస్ ధాటికి ప్రపంచమంతా అతలాకుతలమవుతోంది. అయితే, ఇంత జరుగుతుంటే...చైనా మాత్రం కిమ్మనడం లేదు. పైగా ఎదురుదాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త అంశం తెరమీదకు వచ్చింది. కరోనా వైరస్ గురించి చైనా ముందే ఊహించిందా? అనే సందేహం ఇది. కరోనా వైరస్ తమ దేశం మీద దండెత్తబోతున్నదో చైనా పాలకులు ముందుగానే పసిగట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నట్టే కనిపిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో చైనా కుట్రలు ప్రపంచం తెలుసుకుంటోంది.
కరోనా తన దేశాన్ని ఏ స్ధాయిలో అతలాకుతలం చేస్తుందో ముందే పసిగట్టిన చైనా రెండు వందల కోట్ల మాస్కులను ముందుగానే దిగుమతి చేసుకుందని అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. మొదటి కరోనా మరణం జనవరి 11న సంభవించింది. అంతకు ముందుగానే చైనా పాలకులు కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఏమేమి అవసరమవుతాయో అధ్యయనం చేసి వాటినన్నింటినీ సమకూర్చుకున్నారు. 25 లక్షల ప్రొటెక్టివ్ సూట్లను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. అంతేకాదు వివిధ నిత్యావసరాలను, దైనందిన వాడకంలో ఉండే మరెన్నో వస్తువులను కూడా ముందు జాగ్రత్తగా వివిధ దేశాలనుంచి తెప్పించుకున్నట్టు సమాచారం. 2.46 బిలియన్ల మెడికల్ పరికరాలను కూడా దిగుమతి చేసుకుంది. వీటిలో మాస్కులు, రక్షిత సూట్లు కూడా ఉన్నాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 మధ్య చైనా నేషనల్ కస్టమ్స్ అధికారులు వీటిని తనిఖీ చేశారు. ఆస్ట్రేలియాలోని చైనా సంస్ధలు వీటిని భారీఎత్తున తయారుచేసి తమ స్వదేశానికి పంపించాయి.
తన దేశంలోని కరోనా మరణాల సంఖ్యను చైనా దాచిపెడుతోందని అమెరికాతో సహా అనేక దేశాలు గగ్గోలు పెడుతున్న ఈ తరుణంలో చైనా జాగ్రత్తలకు సంబంధించిన సమాచారం వెలుగులోకి రావడం, అవన్నీ పక్కా ప్లానింగ్తో ఉండటం మైండ్ బ్లాంకయ్యే రీతిలో ఉన్నాయి. కరోనాను అరికట్టేందుకు పలు ప్రపంచ స్థాయి సంస్థలు కృషి చేస్తున్నప్పటికీ చైనా మాత్రం సైలెంట్గా ఉండటం వెనుక రీజన్ ఈ పక్కా ప్లానింగ్ అని పలువురు పేర్కొంటున్నారు.