కరోనా వ్యాప్తి కట్టడికి నిరంతరాయంగా శ్రమిస్తోన్న వైద్యులు , వైద్య సిబ్బంది ఇప్పటి వరకు దాడి చేసిన సంఘటనలని చూడగా , తాజాగా పోలీసులుపై కూడా ఓ తల్లి, కుమారుడు కలిసి దాడికి ప్రయత్నించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . వనపర్తి లో పోలీసులు సామాన్యునిపై ఓవరాక్షన్ చేసి విమర్శలు ఎదుర్కొంటుండగా , మల్కాజ్ గిరి పోలీసు స్టేషన్ పరిధిలో మౌలాలి లో విధులు నిర్వహిస్తోన్న పోలీసుకానిస్టేబుల్ పై సామాన్యులు దాడి చేయడం హాట్ టాఫిక్ గా మారింది . కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెల్సిందే .
లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న నేపధ్యం లో గుంపులుగా ప్రజలు రోడ్ల మీదకు రావొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది . ద్విచక్ర వాహనం పై అత్యవసరమైతే ఒక్కరే వెళ్లాలని చెప్పినప్పటికీ , మౌలాలి ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వెళ్తుండగా విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నారు. లాక్ డౌన్ నిబంధన అమలులో ఉన్న నేపధ్యం లో ఒకే వాహనం పై ముగ్గురు ఎలా ప్రయాణిస్తారంటూ సదరు కానిస్టేబుల్ ప్రశ్నించగా , వాహనం నడుపుతున్న యువకుడు , అతడి తల్లి కానిస్టేబుల్ పై దాడికి యత్నించారు . కానిస్టేబుల్ కాలర్ పట్టుకోవడం స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది .
పోలీసులు ఎంత నచ్చచెబుతున్న తల్లి , కొడుకులు విన్పించుకోక పోవడంతో కొడుకును అదుపులోకి తీసుకున్నారు . కరోనా వ్యాప్తి కట్టడి కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్ డౌన్ నిబంధనలను కొంతమంది ఉద్దేశ్య పూర్వకంగా విస్మరించి , సమాజానికి చేటు చేస్తున్నారు . నిబంధనలు తమ వంటివారికి కాదని అన్నట్లుగా రోడ్లపైకి వస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని , ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది .