అదే ఉల్లంఘనలు, అదే మొండితనం, అదే లెక్కలేని తనం. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి ఉదంతం మరవకముందే..మరో ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం కేరళలోని కొట్టాయం జిల్లా ఎరట్టుపెట్ట గ్రామానికి చెందిన కొంతమంది గ్రామంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల నిర్వాహకుడు సహా 23 మందిని అరెస్ట్ చేశారు. కొచ్చిలో సైతం ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కొచ్చిలోని ఓ చర్చిలో చర్చి ఫాదర్ సహా ఐదుగురు ప్రేయర్ చేశారు. దీంతో పోలీసులు ఆ ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకుని ఆ తర్వాత బెయిల్పై విడిచిపెట్టారు.
ఇదిలాఉండగా, కర్ణాటకలో ముస్లింలంతా కలిసి శుక్రవారం హుబ్లీలోని మంతూర్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా..ముస్లింలంతా పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హుబ్లీ-ధర్వాద్ పోలీస్ కమిషనర్ ఆర్ దిలీప్ వెల్లడించారు.
ఇదిలాఉండగా, ఇవాళ అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధ్యాత్మికవేత్తలు, మతపెద్దలతో మాట్లాడి సభలు, సమావేశాలు నిర్వహించకుండా చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. వైద్యులపై దాడులు హేయమైన చర్య అని పేర్కొన్న ఆయన కరోనాపై పోరాటంలోముందుండి నడిపిస్తున్న వారిపై దాడులు జరగకుండా ప్రజలను చైతన్య పరచాలని ఉపరాష్ట్రపతి కోరారు. కాగా, ప్రాణాంతక కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నా కొందరు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు వందల సంఖ్యలో కేసులు పెరుగుతున్నా వైరస్ తీవ్రతను అర్థం చేసుకోవడం లేదని వాపోతున్నారు.