రాజకీయ నేతలకు వ్యూహాలే కాదు..ప్రజలను ఆకట్టుకునే పంథా కూడా తెలిసి ఉండాలని అంటారు అనుభవజ్ఞులు. ఈ విషయం లో ప్రధాని నరేంద్ర మోడీది అందెవేసిన చేయి. తాను చేయాలనుకున్నది చేస్తూనే.. ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో ఆయన లౌక్యం ముందు ఎంతటి విమర్శకులు కూడా తలూపాల్సిందే. గతంలో పెద్దనోట్లు రద్దు చేసినా.. కొన్నాళ్ల కిందట జమ్ము-కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని తొలగించినా ఆయన వ్యూహం.. ప్రజలను ఒప్పించే లౌక్యం వంటివి నభూతో అనిపించాయి. అంతేకాదు, ప్రజ ల నుంచి ఏదైనా వ్యతిరేకత వస్తే.. గతంలో దేశాన్ని పాలించిన నాయకులు వాటిని వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే, మోడీ విషయంలో మాత్రం ఆత రహా వెనక్కి తగ్గడాలు, ప్రజల డిమాండ్కు తగిన విధంగా స్పందించడాలు వంటివి లేనే లేవు.
ఆయన చేయాలనుకున్నది చేసేయడం, దానికే ప్రజల నుంచి ఆమోదం పొందేలా వ్యవహరించడం మోడీకి కొట్టిన పిండి. అంతే కాదు. గతంలో ప్రధానిగా పదేళ్లు చేసిన మన్మోహన్సింగ్ మాటమాట్లాడేందుకు ఆచితూచి వ్యవహరించేవారు. ఒకవేళ మాట్లా డినా.. కట్టె కొట్టే తెచ్చే.. అనే విధంగా ఆయన ఆ సబ్జెక్టుకు మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ, ప్రస్తుత ప్రధాని మోడీ విషయం లో మాత్రం ఇది మనకు కనిపించదు. మనసులో ఎంత గంభీరమైన విషయం ఉన్నా.. ప్రజలను లౌక్యంగా తన మాటలతో ఆయ న ఆకట్టుకుంటారు. అందుకే ఆయన ప్రపంచంలోనే మాటల మాత్రికుడుగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. మన దేశంలోనూ ఇప్పటికి 80 మంది మృతి చెందారు. రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
అయితే, ప్రపంచంలోని ఇతర దేశాల్లో కేసులు ప్రబలడానికి, మన దేశంలో కేసులు పెరగడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కేంద్ర ప్రభుత్వం ముందుగానే అలెర్ట్ అయి ఉంటే.. మన దేశంలోకి అసలు కరోనా వచ్చేది కాదన్నది మేధావుల మాట. అంతేకాదు, కరోనాను ముందుగా కేంద్ర ప్రభుత్వం లైట్గా తీసుకుంది. గత నెల మార్చి 13న కేంద్ర ఆరోగ్య శాఖ ఓ బులిటెన్ను విడుదల చేస్తూ.. కరోనా పెద్ద ప్రాణాంతక వ్యాధి కాదని పేర్కొంది. అప్పటికే విదేశాల నుంచి వచ్చేవారు దేశంలోకి అడుగు పెట్టేశారు. ఇక, ఢిల్లీలో అదేనెలలో మైనార్టీ వర్గాలు సదస్సులు నిర్వహించాయి వీటికి అనుమతి ఇవ్వకపోయినా.. అధికారులు కట్టడి చేయడంలోను, నిలువరించడలోనూ విఫలమయ్యారు. దీంతో కరోనా ఎఫెక్ట్ దేశాన్ని కుదిపేసే పరిస్థితి వచ్చింది అయితే, వీటన్నింటి నుంచి తనను తాను కాపాడుకోవడంలో ప్రధాని మోడీ తన చతురతను పూర్తిగా వినియోగిస్తున్నారు.
కరోనా ఎలా వచ్చిందనే విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రస్థావించకుండా..కేవలం ప్రజలను దాని నుంచి దృష్టి మళ్లించేలా జనతా కర్ఫ్యూ అంటూ కొత్త పదం వాడారు. ఆ వెంటనే లాక్డౌన్ ప్రకటించారు. ఇక, జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం 5గంటలకు చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. ఇక, ఇప్పుడు కర్ఫ్యూ సమయంలో రేపు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు కరెంటు లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, సెల్ఫోన్ టార్చ్లను వెలిగించాలని పిలుపునిచ్చారు. అయితే, మోడీ మాంత్రీకంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ చర్యలు కేవలం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే ప్రయోజనం కలిగిస్తాయని, ప్రజలకు ఎలాంటి మేలు కలుగజేయబోవని అంటున్నారు. ఏదేమైనా మోడీ మాటల వెనుక ఆంతర్యం పై మాత్రం తీవ్రస్థాయిలో చర్చ సాగుతుండడం గమనార్హం.