బీజేపీ రథసారథి , ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఊహించని చిక్కుల్లో పడిపోయారా? ఒక్కసారిగా వచ్చిపడుతున్న కష్టాలతో...పరిష్కారం లేని సమస్యలతో మోదీజీ ఇరకాటంలో చిక్కుకున్నారా? అందుకే మునుపెన్నడూ లేని రీతిలో కొత్త విధానాన్ని తెరకు ఎత్తుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతంలో సంచలన నిర్ణయాలుగా మారిన పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ అమలు సమయంలో కనిపించిన దూకుడు, ధైర్యం ఇప్పుడు ప్రధానిలో కనిపించడం లేదంటున్నారు. ఆనాడు సొంతంగా కనిపించిన ధైర్యం తాజాగా కరోనా మహమ్మారి సమయంలో కనిపిస్తోందని అంటున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే కీలకమైన లాక్డౌన్ నిర్ణయం తెరమీదకు వచ్చింది. కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న ఈ దశలో దేశ ప్రధానమంత్రి ప్రజల ముందుకొచ్చి ధైర్యం చెప్పడం..జాగ్రత్తలు పాటించాల్సింది గా అప్రమత్తం చేయడం నిస్సందేహంగా మోడీ ప్రారంభించిన ఒక కొత్త ఒరవడి. కానీ ఇదే సమయంలో ఆయన ముందు ఊహించనంత గందరగోళ స్థితి ఉందంటున్నారు. ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ అమలులో ఉంది. అయితే, ఆ తర్వాత ఎలా ముగించాలన్నదే అసలు ప్రశ్న. ఇది మోదీ ముందున్న ప్రశ్న. లాక్డౌన్ 14న ఎత్తివేస్తే...ఒక్కసారిగా దేశమంతా పదిహేనో తారీఖు ఉదయం నుంచే విముక్తం చేయాలా? లేక అంచెలంచెలుగా చేయాలా? లేక ఏయే కార్యకలాపాలను అనుమతించాలి..వేటిని నిలిపివేయాలి? ప్రజల కదలికల మీద ఆంక్షలు సడలించాలా? లేక నిర్ణీత వేళల్లో నిరోధించాలా? వ్యాపార కార్యకలాపాల మాటేమిటి? విద్యా సంస్ధలు.. ఆఫీసులు.. ఇలా వివిధ రంగాల సంగతేమిటి? ఇవన్నీ...ఇవన్నీ ప్రధాని మోదీ ముందున్న ప్రశ్నలు.
అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ఈ సమస్యలకు పరిష్కారం అడిగారు. నిర్దేశించిన గడువు ఏప్రిల్ 14తో లాక్డౌన్ ముగియాల్సి ఉందని..దాన్ని ఎలా ముగించాలో ఆలోచించి సలహాలివ్వండని కోరారు. ప్రధాని అడిగిన ఒకే ఒక్క ప్రశ్నలో ఉన్న అనుమానాలు.. లాక్డౌన్ని మళ్లీ పొడగించాలా అన్న అస్పష్టత సైతం ఉందని పలువురు అంటున్నారు. కాగా, దీనికి విశ్లేషకులు వివిధ సమాధానాలు ఇస్తున్నారు. భారతదేశంలో జనాభా సంఖ్య, జీవన స్థితిగతులు, జీవనశైలి, ఆర్ధికపరిస్థితులను బేరీజు వేసుకుని లాక్డౌన్ దశలు ఎలా ఉండాలో నిర్ణయించాల్సి ఉందంటున్నారు. బహుశా ఇవి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉండొచ్చు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రాల ముఖ్య మంత్రుల సలహాలు, సూచనలు కోరారు అని పేర్కొంటున్నారు.