కరోనా వైరస్ పై జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ నేటి (ఆదివారం) రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది నిమిషాలపాటు దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ అగ్రనేత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారి వాజ్ పేయి రచించిన రండి.. దీపాలు వెలిగిద్దాం అనే ప్రఖ్యాత కవితను ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన విషయం విధితమే. అయితే ప్రధాని పిలుపుపై పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు, పలువురు అధ్యాత్మిక వేత్తలు సానుకూలంగా స్పందించారు. జ్యోతిని వెలిగించండి...ఖ్యాతిని పెంచండి అంటూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మరోసారి భారతదేశ ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండి కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమివేయాలని పలువురు సెలబ్రెటీలు కూడా పిలుపునిచ్చారు. కాగా అందరూ ఇళ్లలో లైట్లను మాత్రమే ఆర్పి వేయాలని టీవీలు, ఫ్రిజ్ లు, కూలర్లు ఆన్ లోనే ఉంచాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.