తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 273 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 11 మంది మృతి చెందారు. హైదరాబాద్ లో పాజిటివ్ కేసుల సంఖ్య సెంచరీ దాటింది. ఆదివారం నాటికి 24 జిల్లాలకు కరోనా వైరస్ విస్తరించింది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఢిల్లీ జమాతేకు వెళ్లి వచ్చిన వారి కారణంగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వరంగల్ ఎంజీఎం దవాఖానాలోని కోవిడ్-19 వార్డులో వైద్య సేవలు అందిస్తున్న ఆరుగురు వైద్యులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారి శాంపిల్లను ఉన్నతాధికారులు హుటాహుటిన హైదరాబాద్ కు పంపారు. కాగా వీరందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చినట్లు ఎంజీఎం వైద్య వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.