ఎక్కడ చూసినా కరోనా.. కరోనా !.. కోవిడ్–19 ప్రపంచాన్నే కుదిపేస్తోంది. 206 దేశాలను చుట్టేసిన ఈ మహమ్హారి, భారత్లోనూ కోరలు చాస్తోంది. ఇప్పటికే దేశంలో 3,718 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 100 మంది చనిపోయారు. 290 మంది దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం దేశంలోని 211 జిల్లాలకు వైరస్ విస్తరించింది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ రాష్ట్రంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలోనే అత్యధికంగా ఇక్కడ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం గమనార్హం. అంతేగాక ఇ ప్పటికే వైరస్ బారిన పడి 32 మంది చనిపోయారు. ఇక మధ్య ప్రదేశ్లో 11, తెలంగాణలో 11 మంది కరోనాతో మృతిచెందారు. ఇప్పటికే రాజధాని హైదరాబాద్లో కేసుల సంఖ్య సెంచరీ దాటింది. అయితే పాజిటివ్ కేసుల్లో ఢిల్లీలోని మర్కజ్ వెళ్లి వచ్చిన వారే అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం.