కరోనా చీకట్లను పారద్రోలేందుకు ప్రధాని మోడీ పిలుపు మేరకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలు కంకణబద్ధులయ్యారు. ఇవాళ రాత్రి తొమ్మిది గంటలకు ఎవరి ఇంట్లో వారు తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని పిలుపునందుకుని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ లు, సినీ,రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు తమ ఇళ్లలో దీపాలు వెలిగించేందుకు సిద్ధమయ్యారు. కరోనా పై పోరాటంలో మనమంతా ఐక్యతను ప్రదర్శించాలని నేటి రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది నిమిషాల పాటు ప్రతి ఇంట్లో దీపాలను వెలిగించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మరోపక్క దీప యజ్ఞంలో పాల్గొనాలని తెలంగాణ గవగ్నర్ తమిళిసై సౌందర్ రాజన్, డీజీపీ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా వైరస్ పై పోరులో భారతీయులంతా ఒకటేనన్న సంకేతాన్ని ప్రపంచదేశాలకు చాటాలని కోరారు. గుంపులుగా గుమికూడవద్దని, సామాజిక దూరం పాటిస్తూనే దీపాలు వెలిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.