దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. ఇప్పటికే 206 దేశాలను కుదుపేస్తున్న కోవిడ్-19 భారత్ లోను విజృంభిస్తోంది. దేశంలోని 211 జిల్లాలకు కరోనా వైరస్ విస్తరించింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ చాపకింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా పోరాటం సాగిస్తున్నప్పటికీ మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. 'వరల్డోమీటర్స్' తాజా గణంకాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకూ కరోనా మృతుల సంఖ్య 99కి చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,588 మందికి చేరుకుంది. 229 మందికి పూర్తిగా స్వస్థత చేకూరించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,260గా ఉంది. కాగా, ఎక్కువ కేసులు, మరణాలు మహారాష్ట్ర నుంచి నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 32 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అదేవిధంగా మధ్యప్రదేశ్, తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 11 కి చేరింది. హైదరాబాద్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 100 కు చేరువలో ఉందని అధికారులు వెల్లడించారు.