లాక్డౌన్ నేపథ్యంలో దేశం మొత్తం కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్ధలు అన్ని మూతపడ్డాయి.ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. దేశంలోని రాజకీయ పార్టీలు అన్ని కూడా తమ కార్యక్రమాలను రద్దుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. టార్గెట్ లను భౌతికంగా నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన యాక్షన్ ప్లాన్ కమిటీకి కాస్త వి రామం ప్రకటించింది. యాక్షన్ ప్లాన్ అమలుపై స్వీయ నిర్బంధం ప్రకటించింది. ఈమేరకు కోరాపుట్-విశాఖ- కార్యదర్శి కైలాసం పేరిట ఆదివారం సాయంత్రం ఒక లేఖతో పాటు ఆడియో టేపును విడుదల చేశారు. ఈ మేరకు పార్టీ తీసుకున్న నిర్ణయాలను అందులో వెల్లడించారు. లాక్ డౌన్ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ అమలును మావోయిస్టు పార్టీ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో పోలీసుల నుంచి దాడులు జరిగితే మాత్రం ప్రతిదాడులు తప్పవని ఆయన హెచ్చరించారు.