దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తున్న మర్కజ్ ఉదంతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్లో జరిగిన ప్రార్థనలు, కరోనా వైరస్ వ్యాప్తిపై పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో...నిజాముద్దీన్లో మర్కజ్కు హాజరై తిరిగి మలేషియా వెళ్తున్న ఎనిమిది మంది విదేశీయులను ఇవాళ ఢిల్లీ పోలీసులు ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు. కరోనా వైరస్కు హాట్స్పాట్ అయిన తబ్లిగీ జమాత్కు ఆ ఎనిమిది మంది మలేషియన్లు హాజరైనట్లు ఆధారాలు ఉన్నాయి.
వాస్తవానికి అంతర్జాతీయ విమానాలు ప్రస్తుతం ఆపరేట్ చేయడం లేదు. కానీ కొన్ని దేశాలు స్పెషల్ ఫ్లయిట్లను నడిపిస్తున్నాయి. అయితే ఇవాళ మలేషియాకు ప్రత్యేక విమానం వెళ్తున్న సందర్భంగా.. మర్కజ్కు హాజరైన 8 మంది ఆ విమానాన్ని ఎక్కేందుకు ఎయిర్పోర్ట్ వచ్చారు. మలిండో ఎయిర్ రిలీఫ్ ఫ్లయిట్ ఎక్కాలనుకున్న వారిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు. మర్కజ్కు హాజరైన వారిని సెల్ఫోన్ డేటా ఆధారంగా గుర్తిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా ఇవాళ క్రైం బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు మర్కజ్కు వెళ్లాయి.
కాగా, తబ్లిగీ జమాత్ కేసు విచారణ కోసం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు మర్కజ్కు వెళ్లారు. ఆ బిల్డింగ్ నుంచి సుమారు 2300 మందిని పోలీసులు ఇటీవల బయటకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తబ్లిగీ జమాత్ అధినేత మౌలానా సాద్పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. లాక్డౌన్ ఉన్నా ఎటువంటి చర్యలు చేపట్టిన కారణంగా.. జమాత్పై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ను ప్రయోగించారు. తబ్లిగి జమాత్ సమావేశాలకు హాజరైనవారిలో 960 మంది విదేశీయుల పాస్పోర్ట్లను సీజ్ చేశారు. వారిని బ్లాక్లిస్టులో పెట్టి వీసాలను రద్దు చేశారు.
బీహార్కు సంబంధించి మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నట్లుగా భావిస్తోన్న32 మందిని గుర్తించే పనిలో ఉన్నామని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. అయితే రాష్ట్రంలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్స్ (పీపీఈ, వ్యక్తిగత రక్షణ పరికరాలు), ఎన్95 మాస్కులు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర ఏజెన్సీలతో పీపీఈలు, మాస్కుల సరఫరాపై ప్రతీ రోజు విజ్ఞప్తులు పంపిస్తున్నామని చెప్పారు. మేము కేంద్రం నుంచి రోజుకు లక్ష పీపీఈలు పంపించాలని అడిగితే కేవలం 4 వేలు మాత్రమే పంపించారు. ఇవాళ 15వేల పీపీఈలు మా దగ్గరకు వచ్చాయని వెల్లడించారు.